అదిగో చార్మినార్.. ఇదిగో సేల్ పేపర్: చంద్రబాబుపై జగన్ సెటైర్లు
బడ్జెట్ సమావేశాల సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై విమర్శలతో విరుచుకుపడ్డారు.
అమరావతి: బడ్జెట్ సమావేశాల సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై విమర్శలతో విరుచుకుపడ్డారు. కనీస మొత్తలకే ప్రభుత్వ భూములను అప్పగించడంపై ఆయన మండిపడ్డారు.
దేవాదాయ భూములను ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం అక్రమంగా కట్టబెట్టిందని ఆరోపించారు. ఎకరం రూ. 70కోట్లు విలువ చేసే భూములను సిద్దార్థ విద్యాసంస్థలకు కారుచౌకగా ఎందుకు కట్టారని ఆయన ప్రశ్నించారు.
ఎకరా లక్షన్నరకు లీజుకు ఇవ్వడం ధర్మమేనా అని జగన్ నిలదీశారు. 2006లో ప్రభుత్వం లీజును రద్దు చేసిందని, దీన్ని 2010లో హైకోర్టు సమర్థించిందని వెల్లడించారు. 10శాతం మార్కెట్ విలువ ప్రకారం లీజుకు ఇస్తే పర్వాలేదని చెప్పారు. ఎకరా రూ. 7కోట్లకు లీజుకు ఇచ్చిన తమకు అభ్యంతరం లేదని తెలిపారు.
అదిగో చార్మినార్.. ఇదిగో సేల్ సర్టిఫికేట్ అన్నట్లుగా ప్రభుత్వ వ్యవహారం ఉందని జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. సదావర్తి భూముల పాపం ఖచ్చితంగా చంద్రబాబుకు తగులుతుందని వైయస్ జగన్ అన్నారు.
దాపర్తి భూముల విషయంలోనూ చంద్రబాబు ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరించిందని అన్నారు. అన్యాక్రాంతం కాని 83ఎకరాల భూములను ఎకరా రూ.22లక్షలకు అమ్మేసిందని దుయ్యబట్టారు. మార్కెట్ ధర రూ. 7కోట్లు ఉంటే.. రూ.22లక్షలకు అమ్మడం సరికాదని దేవాదాయ ప్రాంతీయ కమిషనర్ రాసిన లేఖను ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.
సదావర్తి భూములను అప్పనంగా కట్టబెట్టడంపై కోర్టును ఆశ్రయిస్తే విచిత్రమైన సమాధానం ఇచ్చారని తెలిపారు. ఎకరాకు రూ.22లక్షల కంటే ఎక్కువ ఇస్తే రిజిస్ట్రేషన్ చేయబోమని, సేల్ ఫర్టికేట్ మాత్రమే ఇస్తామని చంద్రబాబు ప్రభుత్వం చెప్పిందని అన్నారు.