పుట్టిన రోజునా అచ్చెన్న ఇలా, కిరణ్ ప్రభుత్వమూ టిడిపిదే: జగన్
హైదరాబాద్: పుట్టిన రోజయినా నిజాలు చెబుతారనుకుంటే మంత్రి అచ్చెన్నాయుడు అబద్ధాలే చెబుతున్నారని ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎపి అసెంబ్లీలో విద్యుత్తు సంస్కరణల బిల్లుపై జరిగిన చర్చలో శనివారం ఆయన ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు.
చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో తొమ్మిదిసార్లు విద్యుత్తు చార్జీలు పెంచారని, వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ఒక్కసారి కూడా పెంచలేదని ఆయన అన్నారు. ఇప్పుడు కూడా విద్యుత్తు చార్జీలు దారుణంగా పెంచుతున్నానరి, ఎపి డిస్కంలు ఎక్కువ రేట్లకు విద్యుత్తును కొనుగోలు చేయడం వల్లనే ఈ పరిస్థితి ఎదురవుతోందని జగన్ అన్నారు.
పవర్ ఎక్స్ఛేంజీల్లో తక్కువ ధరకే విద్యుత్తు అందుబాటులో ఉన్నా దాన్ని వదిలేసి ఎక్కువ ధరకు సుదీర్ఘ కాలం పాటు కొంటున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై ఆడిట్ సంస్థలే తప్పు పట్టాయని ఆయన గుర్తు చేశారు. విద్యుత్తు కొనుగోళ్ల కోసం ఎక్కువ ధర పెడుతున్నాయని ఎపిఈఆర్సీకి ఇండియన్ ఎనర్జీ ఎనర్జీ ఎక్స్ఛేంజీ లేఖ కూడా రాసిందని ఆయన చెప్పారు.
రోజుకు 24 గంటల పాటు యూనిట్కు రూ.2.71 చొప్పున రాత్రి వేళల్లో అయితే రూ.1.90 చొప్పున అందుబాటులో ఉన్నా ప్రభుత్వం మాత్రం ప్రైవేట్ వ్యక్తుల వద్ద యూనిట్కు రూ.5.11 చొప్పున చెల్లిస్తోందని ఆయన చెప్పారు. బొగ్గు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో తగ్గుతున్నా కూడా పాత రేట్లకే కొనుగోలు చేస్తున్నారని తప్పు పట్టారు.
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో హైదరాబాదులోని బషీర్బాగ్లో రైతులను పిట్లలను కాల్చినట్లు కాల్చారని, ఆ విషయం ఇప్పటి కూడా ఎవరూ మరిచిపోలేదని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పెంచిందని, అది కూడా తెలుగుదేశం ప్రభుత్వమేనని, తాము అవిశ్వాసం పెడితే చంద్రబాబు ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసి ఆ ప్రభుత్వాన్ని కాపాడారని ఆయన అన్నారు.