మేం ఏంచెప్తామో వినండి, ఎవరండీ వద్దంటోంది: జగన్
హైదరాబాద్: సభలో ప్రతిపక్షం ఏం చెబుతుందో వినాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సభలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. నదుల అనుసంధానం పైన తనకు రెండున్నర గంటల టైం ఇవ్వాలని జగన్ కోరగా.. స్పకర్ నిరాకరించారు. దీనిపై వైసీపీ ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. తాము ఏం చెబుతున్నామో వినాలన్నారు. ఇష్టమొచ్చిన కాంట్రాక్టర్కు ఎక్కువ రేటుకి టెండర్ ఇచ్చారని ఆరోపించారు. పట్టిసీమపై చర్చకు అరగంట ఇస్తే ఒప్పుకునేది లేదన్నారు. ప్రతిపక్షం చెప్పే విషయాలు అధికార పక్షం వింటే సమస్య అర్థమవుతుందన్నారు.
దీనిపై యనమల రామకృష్ణుడు జోక్యం చేసుకుంటూ.. చర్చకు వైసీపీ వెనక్కి తగ్గుతోందన్నారు. ఆయన వ్యాఖ్యల పైన జగన్ ఘాటుగా స్పందించారు. ఎవరండీ డిస్కషన్ వద్దంటోంది.. మీరా నేనా అంటూ మండిపడ్డారు. ప్రభుత్వం ఎదురుదాడికి దిగడం సిగ్గుచేటు అన్నారు. కాగా, ఆ తర్వాత సీఎం చంద్రబాబు నదుల అనుసంధానంపై వివరణ ఇచ్చారు. అనంతరం సభ వాయిదా పడింది.
తనకు వైయస్ జగన్ పునర్జన్మను ఇచ్చారని మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోమవారం ఉధయం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. మండలిలో వైసీపీ తరఫున తన వంతు ప్రజల కోసం పోరాడుతానని చెప్పారు. అమలు చేయలేని వాగ్ధానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీని నిలదీస్తానన్నారు.