మిమ్మల్ని అణిచివేస్తే అండగా ఉన్న నేను మోసగాడ్నా, జగన్ అనే నేను...: జగన్
పిఠాపురం: కాపు రిజర్వేషన్లపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి స్పందించారు. కాపు రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని, మద్దతిస్తున్నామని ప్రకటించారు. ఆయన ప్రజా సంకల్ప యాత్ర తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ఇటీవల జగ్గంపేట సభలో మాట్లాడుతూ.. కాపు రిజర్వేషన్లు రాష్ట్రం పరిధిలో లేదని, దానిపై తానేం చేయలేనని తెలిపారు.
కాపు దెబ్బ: ఇదీ విషయం... వైసీపీ ట్విస్ట్, జగన్ వ్యూహంపై టీడీపీ అప్రమత్తం
దీనిపై టీడీపీ, కాపు నేతలు మండిపడ్డారు. దీంతో ఈ రోజు ఆయన వివరణ ఇచ్చారు. జగన్ యూటర్న్ తీసుకున్నారని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆరోపించారు. కాపు రిజర్వేషన్లపై వైసీపీ మాట మార్చిందని, వైసీపీ నేతలు రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి చెప్పారు. దీంతో జగన్ మంగళవారం తన పిఠాపురం సభలో ఘాటుగా స్పందించారు. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
మీకు అండగా ఉన్నందుకు నేను మోసగాడినా?
అసలు కాపులను మోసం చేసింది చంద్రబాబేనని జగన్ విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఆయన ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు. రిజర్వేషన్లు ఇస్తామని కాపులకు చెప్పి ఇవ్వకపోవడం మోసం కాదా అని ప్రశ్నించారు. రిజర్వేషన్లు మన పరిధిలో ఉండవని తెలిసి హామీ ఇవ్వడం మోసం కాదా అన్నారు. కానీ కాపులకు తాను కాపులకు అండగా ఉన్నానని, అలాంటి జగన్ మోసగాడు అవుతాడా అన్నారు.
అంతకు రెట్టింపు ఇస్తాం
తాను అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తానని చంద్రబాబు చెప్పాడని జగన్ గుర్తు చేశారు. కానీ చేయలేకపోయాడన్నారు. అయిదేళ్లలో కాపులకు రూ.5వేల కోట్లు ఇస్తానని చెప్పి, ఇప్పటి వరకు ఆయన ఇచ్చింది కేవలం రూ.1340 కోట్లు మాత్రమే అన్నారు. కాపులను మోసం చేసిన చంద్రబాబును నేను ప్రశ్నిస్తున్నానని, అలాంటి తాను మోసగాడినా అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక కాపులకు 10వేల కోట్లు ఇస్తామన్నారు. చంద్రబాబు చెప్పిన దానికంటే రెట్టింపు ఇస్తామన్నారు.
కాపు కమిషన్ చైర్మన్ సంతకం లేకుండా అసెంబ్లీలో
ఆరు నెలల్లో రిజర్వేషన్ ఇస్తానని చెప్పి చంద్రబాబు ఇవ్వలేదని, దీంతో కాపులు ఉద్యమించారని జగన్ గుర్తు చేశారు. ఉద్యమిస్తే కానీ ఆయన మంజునాథ కమిషన్ వేయలేదన్నారు. పైగా అసెంబ్లీలో మొక్కుబడి తీర్మానం పెట్టారన్నారు. కాపు కమిషన్ చైర్మన్ సంతకం లేకుండా అసెంబ్లీలో పెట్టారని దుమ్మెత్తి పోశారు. జగన్ అనే నేను కాపులకు రూ.10వేల కోట్లు ఇస్తానని.. భరత్ అనే నేను సినిమా డైలాగ్లా మాట్లాడారు.
అణిచివేస్తే.. అండగా నిలబడ్డ జగన్ మోసగాడా?
కాపుల విషయంలో తమ వైఖరి ఎప్పుడూ ఒకేలా ఉందని జగన్ చెప్పారు. యూటర్న్ తీసుకునే గుణం తమ ఇంటా వంటా లేదన్నారు. కాపుల రిజర్వేషన్కు మద్దతిస్తున్నామని చెప్పారు. కాపులను చంద్రబాబు అణిచివేస్తుంటే నేను అండగా నిలబడ్డానని, అలాంటి ఈ జగన్ మోసగాడా అన్నారు. కులాల రిజర్వేషన్ అంశం కేంద్రం పరిధిలోనిది అని చెప్పారు. కాపుల రిజర్వేషన్ కోసం మేం ప్రయత్నిస్తాం కానీ కచ్చితంగా హామీ ఇవ్వలేనని చెప్పారు.
చిలుకా గోరింకల్లా కాపురం చేశాయి
నాలుగేళ్ల పాటు బీజేపీ, టీడీపీలు చిలుకా గోరింకల్లా కాపురం చేశాయని, సంసారం చేశాయని, ఇప్పుడు తనను విమర్శిస్తున్నారని జగన్ మండిపడ్డారు. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ మారాలంటే మీ అందరి మద్దతు కావాలన్నారు. తనను విమర్శించడంపై తాను ఎల్లో మీడియాను, చంద్రబాబును అడుగుతున్నానని అన్నారు. దేశంలో అనేక రకాల రిజర్వేషన్ల ఉద్యమాలు ఉన్నాయని, 50 శాతం కంటే ఎక్కువ ఉండొద్దని చట్టం ఉందని, అది సుప్రీం కోర్టు పరిధిలో ఉందని, ఇలాంటి జటిలమైన అంశంపై చంద్రబాబు ఇస్తానని మోసం చేశారన్నారు.