రైతు బంధు కేసీఆర్ కంటే ముందే చెప్పా: పవన్ కళ్యాణ్తో పొత్తు-విశాఖలో దాడిపై జగన్ కీలక వ్యాఖ్యలు
శ్రీకాకుళం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సాక్షి ఇంటర్వ్యూలో ఏపీలో వచ్చే ఎన్నికల్లో పొత్తులు, చంద్రబాబు పాలన తదితర అంశాలపై స్పందించారు. అసెంబ్లీలో తమను మాట్లాడనీయడం లేదని, ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, కాబట్టి పాదయాత్ర ద్వారా జనాలకు చెబుతున్నానని అన్నారు.
తన మేనిఫెస్టో మహా అయితే రెండు పేజీలు ఉంటుందని, ఓట్లు వేయించుకున్న తర్వాత వాటిని అమలు చేయకుంటే తన పదవికి రాజీనామా చేసి వెళ్లిపోతానని జగన్ చెప్పారు. చంద్రబాబులాంటి మనస్తత్వం తనకు లేదన్నారు. తనను చంద్రబాబు జూనియర్ మోడీ అనడంపై జగన్ స్పందిస్తూ.. నాలుగేళ్లు బీజేపీతో కాపురం చేసింది ఎవరని ప్రశ్నించారు. చంద్రబాబు ఇన్నాళ్లు చేసిన తప్పులను కేంద్రంపై వేసి కాంగ్రెస్తో వెళ్తున్నారని, తన తప్పులు ఇతరులపైకి నెట్టే నైజం ఆయనది అన్నారు.
'వారికి పదవులు ఇచ్చి చాలా తప్పు చేశాం, వారిద్దరు పవన్ కళ్యాణ్ బ్రోకర్లు'
సెటిలర్లే ఓటేయలేదు, ఏపీ ప్రజలు ఎలా వేస్తారు
ప్రజలు చంద్రబాబు అనుకున్నట్లుగా పిచ్చోళ్లు కాదని, అందుకే తెలంగాణ ఎన్నికల్లో బుద్ధి చెప్పారని జగన్ అన్నారు. తెలంగాణలో ఎన్నో అబద్దాలు చెప్పి ప్రచారం చేశారని, ప్రజలు చైతన్యవంతులు అని, వాటిని నమ్మలేదని చెప్పారు. ఆంధ్రా సెటిలర్లు ఉన్న హైదరాబాద్ వంటి చోట్ల కూడా వేలాది ఓట్లతో కూటమి అభ్యర్థులు ఓడిపోయారన్నారు. సెటిలర్లే టీడీపీ కూటమికి ఓటు వేయలేదంటే ఇక ఏపీలో ఓటర్లు చంద్రబాబుపై ఏ స్థాయిలో కోపం పెంచుకున్నారో అర్థమవుతోందన్నారు. సెటిలర్లే ఓటేయనప్పుడు ఏపీ ప్రజలు ఎలా వేస్తారన్నారు.
కేసీఆర్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నా
ఏపీకి వెళ్లి చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ చెప్పిన విషయమై జగన్ను ప్రశ్నించగా.. కేసీఆర్ ఏమన్నారో, ఎందుకు అన్నారో తెలియదు గానీ, చంద్రబాబుకు వ్యతిరేకంగా, హోదాకు అనుకూలంగా కేసీఆర్ మాటలను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ప్రధానికి హోదా కోసం లేఖ రాస్తానని చెప్పడం హర్షనీయమన్నారు. కేసీఆర్, మోడీ, జగన్ కలవబోతున్నారని చంద్రబాబు ప్రచారం చేస్తే నమ్మేవాళ్లు లేరని జగన్ అభిప్రాయపడ్డారు. కేసీఆర్ పైన కూడా అలాంటి ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదని చెప్పారు.
ఏ పార్టీతో పొత్తు పెట్టుకోం
చంద్రబాబు ఏపీలో భారీ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని జగన్ అన్నారు. ఇందుకు 2014లో ఆయనతో కలిసిన బీజేపీ, పవన్ కళ్యాణ్ కూడా కారణమని చెప్పారు. ఊరూరా తిరిగి చంద్రబాబుకు ఓటేయమని చెప్పారని అన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలకు తాను పూచి అన్నారని గుర్తు చేశారు. కానీ ఏమయిందన్నారు. తాము వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకునేది లేదని తేల్చి చెప్పారు. జనసేనతో కూడా కలిసేది లేదన్నారు. విడిపోయిన రాష్ట్రానికి రాజధాని అవసరమని, కానీ భారీ అవినీతి జరిగిందని చెప్పారు. పవన్, చంద్రబాబులు కలిసి ఉంటూనే, విడిపోయినట్లు నటిస్తున్నారని, వారు అలా వచ్చినా తనకు భయం లేదన్నారు.
కేసీఆర్ రైతు బంధు కంటే ముందు నేనే ఆ ప్రకటన చేశా
తెలంగాణలో కేసీఆర్ అమలు చేస్తున్న రైతు బంధు గురించి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా మాట్లాడుతున్నారని ప్రశ్నించగా.. జగన్ స్పందిస్తూ.. అసలు వీరందరికంటే ముందు రైతు భరోసా అని చెప్పింది తానే అని అన్నారు. ఈ స్కీం గురించి ఎవరూ చెప్పకముందే నా పాదయాత్రకు ముందు గుంటూరులో జరిగిన మా పార్టీ ప్లీనరీలో నవరత్నాల సందర్భంగా రైతు భరోసా పథకం అమలు చేస్తామని ప్రకటించామన్నారు. ప్రతి రైతు కుటుంబానికి రూ.12,500 ఇస్తామని, నాలుగు దఫాలుగా రూ.50వేలు ఇస్తామని చెప్పామని గుర్తు చేశారు.
విశాఖ దాడి ఘటనపై జగన్ స్పందన
విశాఖపట్నంలో తనపై జరిగిన దాడి ఘటనపై జగన్ స్పందిస్తూ... తనను అభిమానించేవారు తనను చంపడానికి ప్రయత్నిస్తారా అన్నారు. అబద్దాన్ని నిజం చేయడం కోసం ఒక అబద్ధపు ఫ్లెక్సీని సృష్టించారని, ఆ ఫ్లెక్సీ మీద గరుడ పక్షి ఫొటో పెట్టారని,. ఎవరైనా ఫ్లెక్సీ వేసేవారు గరుడ పక్షిని పెడతారా అన్నారు. తన తల్లి ఫొటోనో, తన తండ్రి ఫోటోనో పెడతారన్నారు. దాడి ఎయిర్ పోర్టు పరిధిలో జరిగింది కాబట్టి ఎన్ఏఐకు అప్పగించారన్నారు. తన కేసుల విచారణను జాప్యం చేసేందుకే హైకోర్టు విభజన అనే ఆరోపణను జగన్ కొట్టి పారేశారు.