యనమలే కాంట్రాక్టర్, బాబూ! సీఎం నువ్వానేనా: జగన్ సంచలనం, శ్రీకాకుళం ఎందుకు వెళ్లలేదంటే?
సాలూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు పలుమార్లు మాటలు మార్చారని, హోదా రాకపోవడానికి ఆయనే కారణమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ఆరోపించారు. విజయనగరం జిల్లా సాలూరులో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు.
బాలకృష్ణ కంటే ముందే జూ.ఎన్టీఆర్కు నారా బ్రాహ్మణి సర్ప్రైజ్ గిఫ్ట్, భావోద్వేగం
నారాయణ కాలేజీ, స్కూల్ యాజమాన్యం చంద్రబాబుకు బినామీలు అని ఆరోపించారు. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ దోచుకుంటున్నారన్నారు. ప్రతి గ్రామంలో నీరి దొరకకపోయినా మద్యం మాత్రం దొరుకుతుందని విమర్శించారు. ఉద్యోగాలు భర్తీ చేయకపోయినా ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నారని చెప్పారు.
పోలవరంకు యనమలే కాంట్రాక్టర్
పోలవరం ప్రాజెక్టుకు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడే కాంట్రాక్టర్ అని జగన్ సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు పునాదులు కూడా పూర్తి కాలేదని చెప్పారు. ఆర్టీసీ ఛార్జీలు, ఇంటి పన్నుల పేరుతో బాదుతున్నారని మండిపడ్డారు. జనంపై చంద్రబాబు పన్నుల భారం మోపుతున్నారని చెప్పారు.
అభినందిస్తున్నట్లుగా కలరింగ్, ఎల్లో మీడియా వత్తాసు
హుధుద్ తుపాను వచ్చినసమయంలో తాము ఏదో జయించామని టీడీపీ సంబరాలు చేసుకుందని జగన్ విమర్శించారు. ప్రకృతిని హ్యాండిల్ చేశానని, సముద్రాన్ని జయించానని చెప్పుకున్నావని చెబుతుంటావని, కానీ టిట్లీ తుఫాను బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. టిట్లీ రూ.3435 కోట్లు అని మీరే చెప్పారని, ఈ నష్టాన్ని భర్తీ చేయకుంటే మేం అధికారంలోకి రాగానే ఆదుకుంటామని చెప్పారు. శ్రీకాకుళంలో టిట్లీ తుఫాను బాధితులు.. చంద్రబాబును నిలదీస్తుంటే అభినందిస్తున్నట్లుగా కలరింగ్ ఇస్తున్నారని, చంద్రబాబుకు ఎల్లో మీడియా వత్తాసు పలుకుతోందని చెప్పారు. చంద్రబాబు తుఫాను బాధితులకు ఏదో చేసినట్లు ఎల్లో మీడియా ప్రచారం చేస్తోందన్నారు. ప్రతిపక్షం సహాయక చర్యలకు అడ్డుపడుతోందని ఆరోపించడం విడ్డూరమన్నారు. తుఫాను బాధిత ప్రాంతాలు నిలదీస్తే బుల్డోజర్లతో తొక్కిస్తానని చెప్పారని అన్నారు.
చంద్రబాబు బాధ్యత నీదా నాదా?
నేను శ్రీకాకుళం వెళ్లి టిట్లీ బాధితులను పరామర్శించలేదని చంద్రబాబు, టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని, కానీ వైసీపీ నేతలు, కార్యకర్తలు వెళ్లారని జగన్ చెప్పారు. టీడీపీ చేస్తున్న విమర్శలకు ధీటుగా కౌంటర్ ఇచ్చారు. అయ్యా చంద్రబాబు.. నేను టిట్లీ బాధితులను పరామర్శించలేదని చెబుతున్నారు కానీ, ముఖ్యమంత్రివి నీవా, నేనా, అధికార యంత్రాంగం నీ వద్ద ఉందా నా వద్ద ఉందా, బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ అధినేతగా నీదా, నాదా అని ప్రశ్నించారు.
శ్రీకాకుళం నేను ఎందుకు వెళ్లలేదంటే?
తాను ఎందుకు వెళ్లలేదో కూడా జగన్ చెప్పారు. ప్రతిపక్ష నేతగా తాను ప్రజా సమస్యలపై పాదయాత్ర చేస్తున్నానని, అందుకే తమ పార్టీ నేతలు, కార్యకర్తలు తుఫాను బాధిత ప్రాంతానికి వెళ్లి బాధితుల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని చెప్పారు. మరో వారం రోజుల్లో జగన్ అనే వ్యక్తి పాదయాత్ర చేస్తూ తుఫాను ప్రాంతానికి ఎంటర్ అవుతారని, 50 రోజులు అక్కడే ఉంటానని చెప్పారు.
బొబ్బిలి ఎమ్మెల్యేను సంతలో కొన్నట్లు, రాజన్న దొర వెళ్లనని చెప్పారు
బొబ్బిలి ఎమ్మెల్యేను సంతలో పశువులను కొన్నట్లుగా కొన్నారని జగన్ విమర్శించారు. రాజన్న దొరను కూడా కొనాలని చూశారని, కానీ అన్నా.. నేను అమ్ముడుపోనని రాజన్న దొర తేల్చి చెప్పారని అన్నారు. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను మార్చడానికి నాకు అవకాశమివ్వండని ప్రజలను ఉద్దేశించి జగన్ అన్నారు. ఈ జగన్ను దీవించమని కోరుతున్నానని, ప్రాదేయపడుతున్నానని అన్నారు.