నవీన్ పట్నాయక్ అపాయింట్మెంట్ కోరిన జగన్-తొలిసారి- ఎందుకో తెలుసా ?
పొరుగు రాష్ట్రాల్లో తెలంగాణ మినహా మిగతా రాష్ట్రాలతో అంటీ ముట్టనట్టుగా ఉండే సీఎం జగన్ తొలిసారి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అపాయింట్మెంట్ కోరారు. ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న ఓ సమస్య గురించి కలిసి కూర్చుని మాట్లాడుకుందామంటూ ప్రతిపాదించారు. నవీన్ పట్నాయక్ అపాయింట్మెంట్ లభిస్తే ఇరువురు ముఖ్యమంత్రులు ఈ వివాదంపై చర్చించి పరిష్కారం కనుగొనాల్సి ఉంది.
ఏపీ, ఒడిశా మధ్య వంశధార నదిపై నిర్మించ తలపెట్టిన నేరడి బ్యారేజీ అంశంపై చర్చించేందుకు సీఎం జగన్ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అపాయింట్మెంట్ కోరారు. ఒడిశాలోని కలహందిలో పుట్టే వంశధార నది అక్కడి నుంచి మన రాష్ట్రంలోని శ్రీకాకులం జిల్లాలోకి ప్రవహిస్తోంది. దీంతో వంశధార నదికి సంబంధించి ఏపీ, ఒడిశా మధ్య వివాదాలు ఉన్నాయి. ఇందులో శ్రీకాకుళం జిల్లాలో నిర్మించే వందకోట్లతో నిర్మించాల్సిన నేరడి బ్యారేజీ కీలకమైనది. ఈ వివాదాలు అపరిష్కృతంగా ఉన్నందున బ్యారేజీ పనులు కూడా నిలిచిపోయాయి. దీంతో ఈ వ్యవహారంపై చర్చించేందుకు సీఎం జగన్ నవీన్ పట్నాయక్ అపాయింట్మెంట్ కోరారు.
ఒడిశాతో వివాదాల కారణంగా శ్రీకాకుళం జిల్లాలో నిర్మించాల్సిన నేరడి బ్యారేజ్ నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. వంశధార ప్రాజెక్టును రెండు దశలుగా చేపట్టిన ఏపీ ప్రభుత్వం ఇప్పటికే తొలిదశను పూర్తి చేసింది. ఇప్పుడు నేరడి ప్రాజెక్టు కూడా పూర్తయితే రెండో దశ కూడా పూర్తవుతుంది. దీనికి ఒడిశా ప్రభుత్వం భూమిని కేటాయించాల్సి ఉంది. ఇది పూర్తయితే కానీ నేరడి ప్రాజెక్టు పూర్తి కాదు. అటు వంశధార ట్రైబ్యునల్ మాత్రం ఇరు రాష్ట్రాలు చర్చించుకుని ఈ సమస్య పరిష్కరించుకోమని కోరుతోంది. దీంతో నవీన్ పట్నాయక్ను కలిసి దీనిపై ఓ అంగీకారానికి రావాలని సీఎం జగన్ భావిస్తున్నారు.
Recommended Video