టీడీపీకి డబుల్ చెక్: అటు బిగ్ షాట్ అంబానీ..ఇటు బీసీ ఓటుబ్యాంకు: జగన్ వ్యూహం వెనుక.. !
అమరావతి: వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడం అంటే బహుశా ఇదేనేమో..!. తన గడప తొక్కి వచ్చిన అపర కుబేరుడు ముఖేష్ అంబానీ కోరికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదనలేకపోయారు...ఆయన కోసం తాను ఇదివరకే రూపొందించుకున్న కార్యాచరణ ప్రణాళికను సైతం పక్కన పెట్టారు. ముఖేష్ అంబానీ ఆప్తమిత్రుడు పరిమళ్ నత్వానీని తన పార్టీ తరఫున రాజ్యసభకు పంపించబోతున్నారు.
అంబానీ రిక్వెస్ట్కు జగన్ ఓకే: ఇద్దరు మాజీ మంత్రులకు ఖరారు: వైసీపీ నుండి పెద్దలసభ అభ్యర్ధులు ప్రకటన
నాలుగు స్థానాల్లో..
రాష్ట్రం నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. అవన్నీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకే చేరబోతున్నాయి. ఈ నాలుగు స్థానాల కోసం మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, అయోధ్య రామిరెడ్డిలతో పాటు ముఖేష్ అంబానీ సన్నిహితుడు పరిమళ్ నత్వానీని ఎంపిక చేశారు. రాష్ట్రం నుంచి నత్వానీని రాజ్యసభకు పంపించడానికి ఏకంగా ముఖేష్ అంబానీ స్వయంగా రికమెండ్ చేయడానికి వైఎస్ జగన్ను కలుసుకున్న విషయం తెలిసిందే.
ఈ నలుగురిని పెద్దల సభకు పంపించడం వెనుక..
ఈ నలుగురినీ పెద్దల సభకు పంపించడం వెనుక వైఎస్ జగన్ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు కనిపిస్తోంది. ప్రత్యేకించి- పరిమళ్ నత్వానీని ఎంపిక చేయడం రాష్ట్ర రాజకీయాల్లో ఓ సంచలనంగా మారింది. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడిగా పేరుంది ముఖేష్ అంబానీకి. చాలా సందర్భాల్లో ఇది బహిర్గతమైంది కూడా. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో అంబానీ ఆయనను ఆదుకున్నారనే అభిప్రాయాలు ఇప్పుడూ వినిపిస్తూనే ఉన్నాయి.
అంబానీని తన వైపు తిప్పుకోవడానికి ఎత్తుగడగా..
అలాంటి అంబానీ.. వైఎస్ జగన్ను కలుసుకోవడం, తన ఆప్త మిత్రుడిని రాజ్యసభు పంపించాలంటూ కోరడం.. దీనికి ముఖ్యమంత్రి అంగీకరించడం చకచకా సాగిపోయాయి. అంబానీ వంటి బిగ్ షాట్ స్వయంగా తన ఇంటికి వచ్చి మరీ.. కోరిన కోరికను జగన్ నెరవేర్చడం వల్ల అటు రాష్ట్రానికి, ఇటు పార్టీకి మేలు కలిగించేదేనని చెబుతున్నారు విశ్లేషకులు. నత్వానీని పెద్దల సభకు పంపడం వల్ల అంబానీ మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి బాటలు వేసినట్టయిందనే అభిప్రాయాలు ఉన్నాయి. అదే సమయంలో టీడీపీకి దగ్గరివాడిగా ముద్ర పడిన అంబానీని వైఎస్ జగన్ తన వైపునకు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారనీ అంటున్నారు.
బీసీ నేతలను ఎంపిక చేయడం వల్ల
శాసన మండలిని రద్దు కావడమంటూ జరిగితే మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ పదవులను కోల్పోవాల్సి వస్తుంది. వారిద్దరూ బీసీ నాయకులే. పైగా వారిద్దరూ ఆవిర్భావం నుంచీ వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. వైఎస్ మరణానంతరం చోటు చేసుకున్న పరిణామాల్లో వారిద్దరూ తమ మంత్రిపదవులకు రాజీనామా చేశారు.
టీడీపీ బలమైన ఓటుబ్యాంకుగా..
వారిద్దరినీ రాజ్యసభకు ఎంపిక చేయడం వల్ల అటు బీసీ ఓటుబ్యాంకుపై కూడా పట్టు నిలుపుకొన్నట్టవుతుందనే వాదన వినిపిస్తోంది. అంబానీ తరహాలోనే బీసీ ఓటుబ్యాంకు కూడా టీడీపీకి బలమైనదే. వారిద్దరినీ రాజ్యసభకు ఎంపిక చేయకపోయి ఉంటే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో విమర్శలు చేయడానికి టీడీపీకి అవకాశాన్ని కల్పించినట్టవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ఆ విమర్శలకు చెక్ పెట్టినట్టయిందని అంటున్నారు. అదే సమయంలో.. అయోధ్య రామిరెడ్డిని పెద్దల సభకు పంపడం వల్ల తన సామాజిక వర్గాన్ని కూడా సంతృప్తి పరిచారనే చెబుతున్నారు.