రంగంలోకి జగన్: విజయ సాయికి షాకిచ్చిన సుజయ కృష్ణ
విజయనగరం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావుతో పాటు పెద్ద ఎత్తున నేతలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారనే వార్తల పైన వైసిపి అధినేత వైయస్ జగన్ అప్రమత్తమయ్యారు. పార్టీ సీనియర్ నేతలు విజయ సాయి రెడ్డి, చెవిరెడ్డి భాస్కర రెడ్డిని రంగంలోకి దించారు.
వారు గురువారం నాడు బొబ్బిలి వెళ్లి బొబ్బిలి కోటలో రాజులను కలిశారు. సుజయ కృష్ణ రంగారావు పార్టీ మారే అంశాన్ని చర్చించారు. పార్టీ మారవద్దని కోరినట్లుగా తెలుస్తోంది. వారితో పాటు జిల్లాలో పార్టీ మారుతారని ప్రచారం జరిగిన వారిని కూజా బిజ్జగిస్తున్నారు.
కాగా, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు, ఆయనతో పాటు అతని సోదరుడు బేబీ నాయన టిడిపిలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సుజయతో పాటు, బేబీ నాయనకు కూడా పదవి పైన తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
ఇప్పటికే పదకొండు మంది వైసీపీ ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కారు. మరికొంతమంది వరుసలో ఉన్నారు. ఇదిలా ఉండగా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైసీపీకి బలమైన నేతలుగా ఉన్న సుజయ సోదరులు పార్టీకి దూరమైతే వైసీపీకి పెద్ద ఎదురు దెబ్బ తప్పదన్న భావన వ్యక్తమవుతోంది.
బొత్స సత్యనారాయణను చేర్చుకోవడం వల్లే వారి వైసిపికి దూరమవుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే బొత్స పార్టీలో చేరిన నాడు జగన్ స్వయంగా రంగంలోకి దిగి సర్దిచెప్పడంతో వారు వెనక్కు తగ్గారు. పార్టీలో క్రమంగా బొత్స ప్రాబల్యం పెరుగుతున్న నేపథ్యంలో వారు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
మొహం చాటేసిన సుజయ
సుజయ కృష్ణ రంగారావును బుజ్జగించేందుకు జగన్ తన పార్టీ నేతలు విజయ సాయి రెడ్డి, చెవిరెడ్డి భాస్కర రెడ్డి, ధర్మాన ప్రసాద రావు తదితరులను పంపించారు. వారు సుజయ ఇంటికి వెళ్లి బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. అయితే వారు వెళ్లేసరికి కుటుంబ సభ్యులు ఎవరూ ఇంట్లో లేరు. వీరి రాక తెలియడంతో.. ముందే మరోచోటికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఫోన్ ద్వారా మాట్లాడే ప్రయత్నం చేసినా అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది.