అప్పుల గుట్టు రట్టుపై జగన్ సీరియస్ ?-ఇంటిదొంగలపై దృష్టి -విపక్షాలకు కష్టమే
ఏపీలో ప్రభుత్వం తీసుకుంటున్న అప్పులు పతాకస్ధాయికి చేరిన నేపథ్యంలో ప్రభుత్వంలోని లొసుగుల్ని అడ్డుపెట్టుకుని వాటి వివరాలు సంపాదిస్తున్న విపక్షాలు.. సీఎం జగన్ ను టార్గెట్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో తాజాగా పలు ఆర్ధిక వ్యవహారాలు, రహస్య అప్పులు తెరపైకి వచ్చాయి. దీంతో తాజా వ్యవహారాలపై సీరియస్ గా ఉన్న సీఎం జగన్... సచివాలయంలోని ఆర్ధిక శాఖ ఉద్యోగులపై విజిలెన్స్ విచారణ చేయించి మరీ పలువురిని సస్పెండ్ చేశారు. దీంతో ఈ ఉద్యోగుల సాయంతోనే విపక్షాలు ఆర్ధికశాఖను టార్గెట్ చేస్తున్నాయన్న కోవంతో ఉన్న ప్రభుత్వం తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది.
వైసీపీ సర్కార్ అప్పుల తిప్పలు
వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చే నాటికే ప్రభుత్వం దాదాపు రెండున్నర లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. గత చంద్రబాబు ప్రభుత్వం రాజధాని పేరుతో చేసిన అప్పులతో పాటు వివిధ సంక్షేమ పథకాలకు చేసిన సర్దుబాట్లే ఇందుకు ప్రధాన కారణం.
అదే సమయంలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక కూడా ఆర్ధిక క్రమశిక్షణ పాటించకపోవడంతో ఈ అప్పులు మరింత పెరిగిపోయాయి. దీంతో ఎఫ్ఆర్బీఎం పరిమితి ప్రకారం అప్పులు తీసుకోవాల్సిన పరిస్ధితుల్లో దాన్ని దాటి మరీ అప్పులు చేసేందుకు ప్రభుత్వం మార్గాలు వెతుతుకోంది. దీంతో వ్యవస్ధలో ఉన్న లొసుగుల్ని సద్వినియోగం చేసుకుంటూ కార్పోరేషన్ల ద్వారా అప్పులు తెస్తోంది. ఇందుకోసం పలు కొత్త కార్పోరేషన్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్పోరేషన్ల ద్వారా తెస్తున్న అప్పుల్ని విపక్షాలు టార్గెట్ చేయంతో ప్రభుత్వం పూర్తిగా ఇరుకునపడుతోంది.
అప్పుల రహస్యాలు లీక్
వైసీపీ సర్కార్ ఎఫ్ఆర్బీఎం పరిమితిని తప్పించుకునేందుకు తీసుకుంటున్న అప్పులు వివాదాస్పదంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఏపీఎస్డీసీతో పాటు పలు కార్పోరేషన్ల ద్వారా తీసుకుంటున్న రుణాలు ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి రావంటూ ప్రభుత్వం వాదిస్తుండగా.. విపక్షాలు ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం చట్ట నిబంధనల్ని వైసీపీ సర్కార్ ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తున్నాయి. ఇదే క్రమంలో ఆర్ధిక శాఖ తీసుకుంటున్న నిర్ణయాలు విపక్షాలకు చేరడంతో వాటిని వాడుకుంటూ నిత్యం ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. తాజాగా బయటపడిన ఏపీఎస్డీసీ రుణాల వ్యవహారంతో పాటు మరికొన్ని అంశాలు విపక్షాలకు వరంగా మారిపోతున్నాయి. సరిగ్గా వీటినే పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ తో పాటు పలువురు టీడీపీ నేతలు నిత్యం వాడుకుంటూ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. దీంతో వీటిని కౌంటర్ చేయడం ప్రభుత్వానికి కష్టంగా మారుతోంది. ఆరంభంలో వీటికి అడ్డుకట్ట వేసేందుకు అధికారులతో వివరణ ఇప్పించినా సద్దుమణగకపోవడం, చివరికి ప్రజల్లోకి కూడా నెగెటివ్ గా వెళ్లడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది.
లీకేజీలపై జగన్ సీరియస్
ఏఫీలో కొత్త అప్పుల కోసం ఆర్ధికశాఖ తీసుకుంటున్న నిర్ణయాలు రహస్యంగా ఉండాల్సి ఉండగా.. అవి కాస్తా విపక్షాల చేతుల్లోకి వెళ్లడం, వాటిని వాడుకుంటూ తమను నిత్యం టార్గెట్ చేస్తుండటంతో సీఎం జగన్ ఈ వ్యవహారంపై సీరియస్ అవుతున్నారు. ఇప్పటికే ఆర్ధికశాఖకు చెందిన సెక్షన్ ఆఫీసర్ స్ధాయి ఉద్యోగులు ముగ్గురిని సస్పెండ్ చేయడంతో పాటు సీఎఫ్ఎంఎస్ లో పనిచేస్తున్న మరికొందరు ఉద్యోగుల్నీ సాగనంపారు. మరికొందరు ఉద్యోగులపై కూడా త్వరలో చర్యలుంటాయని చెప్తున్నారు. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్ని కుదిపేస్తోంది. ప్రభుత్వంలో రహస్యంగా ఉండాల్సిన విషయాలు బయటి వ్యక్తులకు చేరడం, అవి విపక్షాలకు రాజకీయ అస్త్రాలుగా మారడంతో వీటిపై తీవ్ర స్ధాయిలో చర్చ జరుగుతోంది. ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండటం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్న చర్చ సాగుతోంది. దీంతో ప్రభుత్వం ఇప్పుడు వీటిపై దృష్టిపెట్టింది.
ఇంటిదొంగలపై సర్కార్ దృష్టి
ఆర్ధికశాఖలో ఉన్నతస్ధాయిలో తీసుకుంటున్న నిర్ణయాలు సైతం ఆధారాలతో సహా విపక్షాల చేతికి చేరడం, వాటిని వాడుకుంటూ అవి నిత్యం ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుండటంతో ప్రభుత్వంలో అంతర్మథనం సాగుతోంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణ చేయించి బాధ్యుల్ని సాగనంపిన ప్రభుత్వం.. ఇక ఇలాంటి వారు ఇంకెందరు ఉన్నారన్న దానిపై దృష్టిసారిస్తోంది. ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వం దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఇంటి దొంగల్లో భయం పెరుగుతోంది. సచివాలయంలోని వివిధ శాఖల్లో ఇలాంటి ఉద్యోగులు పదుల సంఖ్యలో ఉండి ఉండొచ్చన్న సమాచారంతో ప్రభుత్వం అంతర్గతంగా విచారణ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం నిఘాతో పాటు విజిలెన్స్ విభాగాలను వాడుకుంటోంది. తాజాగా ఆర్ధిక శాఖలోని ఇంటిదొంగలు తమ గుట్టును బయటపెట్టడంతో రాజకీయంగా ప్రభుత్వానికి నష్టం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తుండమే ఇందుకు కారణం. దీంతో సాధ్యమైనంత త్వరగా వీరిపై చర్యలు ఉండొచ్చన్న ప్రచారం సాగుతోంది.
విపక్షాలకు ఇక కష్టమేనా ?
గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో సచివాలయంలోని వివిధ శాఖల్లో నేరుగా, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతుల్లో భారీ సంఖ్యలో ఉద్యోగుల నియామకాలు జరిగాయి. అప్పట్లో హైదరాబాద్ నుంచి సచివాలయం ఇక్కడికి తరలిరావడం, ఇతరత్రా పరిస్ధితుల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో అప్పట్లో ప్రభుత్వం నియమించిన ఉద్యోగులు ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నారు. వీరిలో కొందరు స్వామిభక్తి ప్రదర్శించే క్రమంలో ప్రస్తుత వైసీపీ సర్కార్ గుట్టును విపక్షాలకు చేర వేస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో భవిష్యత్తులో భారీ ఎత్తున అలాంటి ఉద్యోగులపై చర్యలకు ప్రభుత్వం రంగం సిద్ధఁ చేస్తోంది. అదే జరిగితే విపక్షాలకు ప్రభుత్వ సమాచారం లీకేజీలకు అడ్డుకట్ట పడటంతో పాటు విపక్షాలకు ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు అస్త్రాలు లేకుండా పోతాయని తెలుస్తోంది.