సొంత మనిషికి షాకిచ్చిన జగన్ - ప్రమోషన్ ఇవ్వకపోగా డిమోషన్- వైసీపీలో ఇదే చర్చ..
ఏపీలో వైఎస్ కుటుంబ విధేయుడు, స్వయంగా సీఎం జగన్ సన్నిహితుడు, సీఎం సొంత జిల్లాకే చెందిన నాయకుడు.. ఇన్ని అర్హతలున్న ఆ వైసీపీ ఎమ్మెల్యేకు వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి పదవులు దక్కుతాయో చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ ఎక్కడ ఏ తేడా కొట్టిందో తెలియదు కానీ జగన్ కు అంత సన్నిహితుడు కాస్తా ఇప్పుడు సాధారణ వ్యక్తిగా మారిపోతున్నారు. వైసీపీ సర్కార్ తొలిసారి అధికారంలోకి వచ్చాక ఆయనకు దక్కిన పదవి కొనసాగకపోగా.. తాజాగా డిమోషన్ కూడా దక్కడంతో పార్టీలో ఇదే చర్చ జరుగుతోంది.
గడికోట శ్రీకాంత్ రెడ్డి
ఏపీలో వైసీపీ ప్రభుత్వంలో జగన్ కు అత్యంత సన్నిహితుల్లో వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి కూడా ఒకరు. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలోని రాయచోటి నియోజకవర్గం నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్న శ్రీకాంత్ రెడ్డికి తన నియోజకవర్గంలోనే కాదు జిల్లాలోనే రాజకీయంగా మంచి పట్టుంది. అంతే కాదు వైఎస్ కుటుంబంతో, స్వయంగా వైఎస్జ జగన్ తో సుదీర్ఘ అనుబంధం కూడా ఉంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు శ్రమించిన వారిలోనూ శ్రీకాంత్ రెడ్డి ఎప్పుడూ ముందే ఉంటారు. దీంతో శ్రీకాంత్ రెడ్డికి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్ మంత్రిని చేస్తారని అంతా భావించారు. కానీ అలా జరగలేదు.
శ్రీకాంత్ కు ఛీఫ్ విప్ తోనే సరి
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తనకు కచ్చితంగా తొలి కేబినెట్లోనే మంత్రి పదవి దక్కుతుందని శ్రీకాంత్ రెడ్డి ఎంతో ఆశించారు. సీఎం జగన్ సొంత జిల్లా కావడం, ఆయనతో పాటు ఆయన కుటుంబంతో తనకు ఉన్న అనుబంధం కలిసొస్తుందని భావించారు కానీ జగన్ సామాజిక సమీకరణాలు దెబ్బకొట్టాయి. ఫలితం శ్రీకాంత్ రెడ్డి ఛీఫ్ విప్ పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయినా శ్రీకాంత్ రెడ్డి నిరాశపడలేదు.అసెంబ్లీలో టీడీపీపై దూకుడుగా వ్యవహరిస్తూ, వైసీపీ ఎమ్మెల్యేలను సమన్వయం చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు.
మంత్రి దక్కకపోగా ఛీఫ్ విప్ అవుట్
వైఎస్ జగన్ తొలి కేబినెట్ లో చోటు కల్పించకపోవడంతో రెండో కేబినెట్ లో కచ్చితంగా తనకు చోటు దక్కుతుందని శ్రీకాంత్ రెడ్డి ఆశించారు. కానీ ఈసారి కూడా శ్రీకాంత్ కు నిరాశ తప్పలేదు. ఉమ్మడి వైఎస్సార్ జిల్లా నుంచి అంజాద్ బాషాను మైనార్టీ కోటాలో కొనసాగించడంతో శ్రీకాంత్ ఆశలు అడియాశలయ్యాయి. అదే సమయంలో ఆయన పదవి ఛీఫ్ విప్ కూడా కొనసాగలేదు. మంత్రి పదవుల పందేరంలో వెనుకబడిన జగన్ మరో సన్నిహితుడు ముదునూరి ప్రసాదరాజు శ్రీకాంత్ స్ధానంలో ఛీఫ్ విప్ గా నియమితులయ్యారు. దీంతో మంత్రి పదవి దక్కకపోగా ఉన్న ఛీఫ్ విప్ పదవి కూడా పోయింది. దీంతో శ్రీకాంత్ రెడ్డిలో అసంతృప్తి నెలకొంది. దీన్ని గమనించిన జగన్ తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు.
శ్రీకాంత్ రెడ్డికి ప్రమోషన్ స్ధానంలో డిమోషన్ ?
శ్రీకాంత్ రెడ్డికి వరుసగా రెండుసార్లు కేబినెట్ పదవి దక్కకపోగా.. గతంలో అసెంబ్లీలో ప్రోటోకాల్ తో కూడిన ఛీఫ్ విప్ పదవితో సరిపెట్టుకున్నారు. కానీ రెండోసారి కేబినెట్ విస్తరణ సందర్భంగా ఆ పదవి కూడా పోవడంతో నిరాశలో ఉన్న శ్రీకాంత్ కు జగన్ మరో షాకిచ్చారు. ఈసారి ఆయనకు విప్ పదవి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో గతంలో ఛీఫ్ విప్ గా పనిచేసిన శ్రీకాంత్ కు డిమోషన్ దక్కినట్లయింది. వైసీపీలో ఇంత కీలకంగా ఉన్న తన సన్నిహితుడికి జగన్ ప్రమోషన్ ఇవ్వకపోగా.. డిమోషన్ ఇవ్వడంపై సీఎం సొంత జిల్లాతో పాటు వైసీపీలో తీవ్ర చర్చ జరుగుతోంది. అంతకుమించి దీని వెనుక ఉన్న కారణాలపై చర్చ జరుగుతోంది.