మారుతున్న సమీకరణాలు, సుజయకు చెక్: రంగంలోకి దిగిన బొత్స, శంబంగికి వెల్కం
విజయనగరం: తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్కు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతి వ్యూహానికి తెరలేపింది. విజయనగరం జిల్లాలో బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావుకు చెక్ చెప్పేందుకు వైసిపి నేత బొత్స సత్యనారాయణ వర్గం స్వయంగా రంగంలోకి దిగింది.
బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు ఈ నెల 18వ తేదీన తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆయనతో పాటు ఆయన సోదరుడు, పెద్ద ఎత్తున వైసిపి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కూడా సైకిల్ ఎక్కనున్నారు. దీంతో, వైసిపి దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది.
సుజయ రంగ కృష్ణా రావు పార్టీ వీడినా తమకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పే ప్రయత్నానికి తెరలేపింది. ఇప్పటి దాకా ఆయనను బుజ్జగించేందుకు వైసిపి అధినేత జగన్.. విజయ సాయి రెడ్డి, చెవిరెడ్డి భాస్కర రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిలను పంపించారు. కానీ ఆయన వారికి షాకిచ్చారు.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి వ్యూహానికి తెరలేపారు. వైసిపి మాజీ విప్ శంబంగి వెంకట చిన అప్పల నాయుడును పార్టీలోకి తీసుకు వచ్చేందుకు బొత్స సత్యనారాయణ పావులు కదుపుతున్నారు. శంబంగి 2013లో వైసిపిని వీడారు. ఆయనను తిరిగి పార్టీలోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.
శంబంగిని బొత్స వర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించింది. విజయనగరంలో పార్టీని, ముఖ్యంగా సుజయ కృష్ణ రంగారావు వెళ్తున్న బొబ్బిలి నియోజకవర్గంలో పార్టీ పట్టు కోల్పోకుండా ఉండేందుకు బొత్స.. శంబంగిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. శంబంగి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
సుజయ కృష్ణ రంగారావు టిడిపిలో చేరనున్న నేపథ్యంలో.. ఇప్పటి వరకు బుజ్జగింపుల పర్వానికి దిగిన జగన్ ఇప్పుడు ఇతర నేతలతో సుజయకు చెక్ పెట్టేందుకు ప్రతి వ్యూహానికి సిద్ధం కావడం గమనార్హం. దీంతో ఒక్కసారిగా విజయనగరం రాజకీయాలు వేడెక్కాయి. సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.