నంద్యాల: టిడిపి వ్యూహమిది, కానీ, వైసీపీ ఇలా, శిల్పాకు దెబ్బేనా?
నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నికల్లో పోటీ విషయమై వైసీపీ అధినేత జగన్ మరోసారి ఆలోచించుకోవాలి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం కె.ఇ. కృష్ణమూర్తి కోరారు.
నంద్యాల: నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నికల్లో పోటీ విషయమై వైసీపీ అధినేత జగన్ మరోసారి ఆలోచించుకోవాలి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం కె.ఇ. కృష్ణమూర్తి కోరారు. నంద్యాల అసెంబ్లీ స్థానానికి త్వరలో షెడ్యూల్ విడుదల కానున్నందున టిడిపి జోరును పెంచింది.అయితే ఈ స్థానం ఏకగ్రీవమైతే శిల్పా మోహన్ రెడ్డికి చిక్కులు ఎదురౌతాయి. పార్టీ మారినా ఆయనకు ప్రయోజనం ఉండదు.అయితే ఈ విషయంలో జగన్ నిర్ణయమే కీలకంగా మారనుంది.
నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నికల్లో విజయం సాధించేందుకు టిడిపి, వైసీపీలు కసరత్తుచేస్తున్నాయి. మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి టిడిపిని వీడి వైసీపీలో చేరడం ఆ పార్టీకి నష్టం కల్గించింది.
అయితే శిల్పాను పార్టీనుండి బయటకు వెళ్ళకుండా చేసిన ప్రయత్నాలు సఫలంకాలేదు. టిక్కెట్టు కేటాయింపు విషయమై చంద్రబాబునాయుడు స్పష్టత ఇవ్వని కారణంగా ఈ పరిస్థితి ఎదురైందనే అభిప్రాయాన్ని శిల్పా మోహన్ రెడ్డి వ్యక్తం చేశారు.
అయితే వైసీపీ నుండి ఆఫర్ రావడంతో శిల్పా పార్టీ మారారు.మోహన్ రెడ్డి టిడిపిని వీడిన ఏడురోజులకే జగన్ ఆయనకు టిక్కెట్టును కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. ఉప ఎన్నికల్లో గెలుపు కోసం శిల్పా ప్లాన్ చేస్తున్నాడు. తన వర్గం నాయకులతో ఆయన టిడిపిని వీడి వైసీపీలో చేరారు.
పోటీపై పునరాలోచన చేయాలి
నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసే విషయమై పునరాలోచన చేయాలని ఏపీ డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి వైసీపీ చీప్ జగన్ను కోరారు. సంప్రదాయలను పాటించాలని ఆయన గుర్తుచేశారు. గతంలో చోటుచేసుకొన్న సంప్రదాయాలను ఆయన ప్రస్తావించారు. అయితే అవినీతి కేసులు ఎదుర్కొంటున్న వైఎస్ జగన్ పార్టీలో శిల్పా మోహన్ రెడ్డి చేరడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రజాప్రతినిధి మరణిస్తే వారి కుటుంబసభ్యులు పోటీ చేస్తే ఇతర పార్టీలు పోటీకి దూరంగా ఉంటూ సంప్రదాయాన్ని పాటిస్తున్నాయని ఆయన చెప్పారు.
ఏకగ్రీవమైతే టిడిపికి ప్రయోజనం
నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నికల్లో పోటీ జరగకుండా ఏకగ్రీవంగా ఎన్నిక జరిగితే రాజకీయంగా టిడిపికి ప్రయోజనం. అదే జరిగితే వైసీపీకి నష్టమేననే అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఈ స్థానం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి భూమా నాగిరెడ్డి విజయం సాధించారు. అయితే ఏడాదిన్నర క్రితం భూమా నాగిరెడ్డి వైసీపీని వీడి టిడిపిలో చేరారు. కానీ, సాంకేతికంగా ఆయన వైసీపీ సభ్యుడే. అయితే ఈ ఏడాది మార్చి 12న, భూమా నాగిరెడ్డి మరణించాడు. దీంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ స్థానానికి పోటీ జరగకుండా ఏకగ్రీవంగా ఎన్నిక జరిగితే టిడిపి అభ్యర్థి బ్రహ్మనందరెడ్డి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.ఏకగ్రీవమైతే టిడిపికి అదనంగా ఈ సీటు కలిసిరానుంది.
వైసీపీ చేస్తోన్న వాదన ఇది
ఈ స్థానానికి పోటీలేకుండా ఏకగ్రీవంగా ఎన్నిక పూర్తి కావాలంటే వైసీపీ అభ్యర్థిని ఈ స్థానం నుండి ఏకగ్రీవంగా అసెంబ్లీకి పంపాలని వైసీపీ ప్రతిపాదిస్తోంది. గతంలో ఇదే ప్రతిపాదనను జగన్ చేశారు. నంద్యాల సీటు సాంకేతికంగా తమ పార్టీకి చెందినదని ఆ పార్టీ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది.2014లో వైసీపీ గుర్తుపైనే భూమా నాగిరెడ్డి విజయం సాధించారని వైసీపీ నేతలు గుర్తుచేస్తున్నారు. వైసీపీ ప్రతిపాదించే అభ్యర్థికి మద్దతిస్తే తాము ఏకగ్రీవానికి సిద్దమేనని వైసీపీ ఇదివరకు ప్రకటించింది. అయితే ఈ ప్రతిపాదనకు టిడిపి ఒప్పుకోదు. భూమా కుటుంబం ప్రస్తుతం టిడిపిలో ఉంది.
సంప్రదాయం పేరుతో టిడిపి చివరి అస్త్రం
ప్రజాప్రతినిధులు మరణించిన సమయాల్లో ఆ కుటుంబానికి చెందినవారు ఎన్నికల్లో పోటీచేస్తే ప్రత్యర్థి పార్టీలు పోటీకి దూరంగా ఉంటున్న సంప్రదాయాన్ని టిడిపి మరోసారి తెరమీదికి తెచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకొన్న ఘటనలతో పాటు శోభానాగిరెడ్డి మరణం వరకు దారితీసిన పరిస్థితులను ఆ పార్టీ ప్రస్తావిస్తోంది. సంప్రదాయాలను పాటించాలని కోరుతోంది.
శిల్పా మోహన్ రెడ్డికి ఇబ్బందే
టిడిపి అభ్యర్థిని ఏకగ్రీవంగా అసెంబ్లీకి పంపించాల,ని మరోసారి అసెంబ్లీలో వైసీపీని కోరాలని టిడిపి భావిస్తోంది. అనుకోని పరిస్థితుల్లో వైసీపీ ఈ ప్రతిపాదనకు ఓకే చెబితే రాజకీయంగా శిల్పా మోహన్ రెడ్డికి ఇబ్బందులు ఎదురౌతాయి. అధికార పార్టీని వీడి వైసీపీలో చేరారు. టిక్కెట్టు కోసం తన వర్గాన్ని కాపాడుకొనేందుకుగాను ఆయన పార్టీని వీడారు. అయితే ఆయనకు ఉపఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కకపోతే రాజకీయంగా భూమా కటుంబం ఆధిక్యత సాధించినట్టు అవుతోంది. అదే జరిగితే శిల్పా రెండు విధాలుగా నష్టపోయే ప్రమాదం ఉంది.వైసీపీ మాత్రం ఏకగ్రీవ ప్రతిపాదనకు దూరంగా ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయి.అయితే ఏకగ్రీవం కోసం టిడిపి చేస్తోన్న వినతి పట్ల వైసీపీ సానుకూలంగా స్పందించే అవకాశం ఉండకపోవచ్చుననే అభిప్రాయాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ విషయమై జగన్ తీసుకొనే నిర్ణయమే కీలకంగా మారనుంది.