'జగన్ చేయాల్సిన 2 పనులు.. బాబు వద్దకు వెళ్లి మద్దతివ్వడం', మెత్తబడిన ఆనం రామనారాయణ
Recommended Video
విజయవాడ: కేంద్రం పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధర్మపోరాటం చేస్తున్నారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న గురువారం అన్నారు. వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓ 420 అని, కేంద్రంతో లాలూచీపడి ఎంపీలతో దీక్షలు, రాజీనామా నాటకం ఆడించారని మండిపడ్డారు.
ఎత్తుకు పైఎత్తు: చంద్రబాబు దీక్ష రోజే జగన్ అనూహ్య నిర్ణయం తీసుకుంటారా?
ప్రధాని నరేంద్ర మోడీ ఆశీస్సుల కోసం జగన్ ఓవరాక్షన్ చేస్తున్నారని విమర్శించారు. మహాత్ములు పుట్టిన నెలలోనే చంద్రబాబు పుట్టారన్నారు. చంద్రబాబు ధర్మపోరాటానికి ఢిల్లీ పీఠం కదులుతుందని జోస్యం చెప్పారు. ప్రతి ఇంటి నుంచి ధర్మ పోరాటానికి తరలి రావాలన్నారు.
చంద్రబాబు దీక్షకు వెళ్లి మద్దతివ్వాలి
ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి ఉంటే జగన్ రెండు పనులు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీకి సూచించారు. మొదటిది.. ఏపీకి జరిగిన అన్యాయంపై మీడియా సమక్షంలోప్రధాని మోడీని జగన్ గట్టిగా ప్రశ్నించాలన్నారు. రెండోది.. చంద్రబాబు దీక్షకు జగన్ వెళ్లి సంఘీభావం తెలపాలన్నారు.
వైసీపీలోకి.. ఆనం యూటర్న్
మరోవైపు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఆయన త్వరలో వైసీపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగింది. కేవలం నియోజకవర్గం విషయంలోనే ప్రతిష్టంభన ఏర్పడిందని, త్వరలో అది సమసిపోయి వైసీపీలో చేరుతారని భావించారు. కానీ ఇప్పుడు ఆనం మెత్తబడినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఆనం రామనారాయణ రెడ్డికి బుజ్జగింపులు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో బుధవారం ఆనం సోదరుడు జయకుమార్ రెడ్డి భేటీ అయ్యారు. తాను తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని ఆయన చెప్పారు. మరోవైపు ఆనం రామనారాయణ రెడ్డిని టీడీపీ నేతలు బుజ్జగిస్తున్నారు. బుజ్జగింపుల నేపథ్యంలో ఆయన మెత్తబడినట్లుగా తెలుస్తోంది. మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు ఆయనతో టచ్లో ఉన్నారు. ఆనం మెత్తబడ్డాడని టీడీపీ నేతలు అంటున్నారు.
దీక్షలో పాల్గొనాలని ఆనం కార్యాలయం నుంచి సందేశం
శుక్రవారం ఆత్మకూరు నియోజకవర్గంలో జరిగే ధర్మపోరాట దీక్షలో పాల్గొనాలని కార్యకర్తలకు ఆనం రామనారాయణ రెడ్డి సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ దీక్షలో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొనాలని, ఆనం పార్టీ కార్యాలయం నుంచి సందేశాలు వెళ్లాయని సమాచారం. దీంతో ఆనం మెత్తబడినట్లుగా భావిస్తున్నారు.