'జగన్ ఆస్తులిచ్చాకే దీక్ష చేయాలి': అనుమానాలు.. బాబుకు పురంధేశ్వరి షాక్
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తన అక్రమాస్తులను ప్రభుత్వానికి అప్పగించాలని డిమాండ్ చేస్తూ బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మహిళలు నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో పాలకొల్లు నుంచి నరసాపురం వరకు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ... జగన్ ప్రత్యేక హోదాకై దీక్ష చేసే ముందు తన అక్రమ ఆస్తులను ప్రభుత్వానికి ఇవ్వాలన్నారు.
తద్వారా డ్వాక్రా రుణాల మాఫీతో పాటు నూతన రాజధాని నిర్మాణంలోను తన సహకారం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
పట్టిసీమ, భోగాపురంపై సందేహాలు: పురంధేశ్వరి
ఏపీ ప్రభుత్వం చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టు, భోగాపురం ప్రాజెక్టుల పైన తమకు అనుమానాలు ఉన్నాయని బిజెపి మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు, మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి మంగళవారం అన్నారు. ప్రకాశం జిల్లా అద్దంలో ఆమె విలేకరులతో మాట్లాడారు.
ఆయా ప్రాజెక్టుల పైన మిత్రపక్షమైన తమకు కలిగిన అనుమానాలు తొలగించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా రాకపోయినప్పటికీ దానికి సమానమైన అవకాశాలు కల్పించేందుకు కేంద్రం చూస్తోందని తెలిపారు. రాష్ట్ర నూతన రాజధానికి కేంద్రం నిధులు ఇవ్వనుందా.. అనే దానికి రాజధాని మాస్టర్ ప్లాన్, డిస్ట్రిబ్యూటరీ ప్రాజెక్టు రిపోర్టు ఇంతవరకు పంపకుంటే ఎలా కేటాయిస్తారన్నారు.