జగన్కు షాక్, అసాధారణ నిర్ణయం: రూ.170 కోట్లు ఈడీ ఖాతాలోకి, దిగ్భ్రాంతి, లంచ్ మోషన్..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి గట్టి షాక్ తగిలింది. జగన్కు చెందిన రూ.170 కోట్ల స్థిర, చరాస్తులను ఈడీ పూర్తిగా స్వాధీనం చేసుకుంది.
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి గట్టి షాక్ తగిలింది. జగన్కు చెందిన రూ.170 కోట్ల స్థిర, చరాస్తులను ఈడీ పూర్తిగా స్వాధీనం చేసుకుంది. నూటా డెబ్బై కోట్ల రూపాయల విలువైన ఎఫ్డీలు, షేర్లను తమ ఖాతాలోకి ఈడీ బదిలీ చేసుకుంది.
జగన్ అక్రమాస్తుల కేసులో భారతి సిమెంట్స్ అటాచ్మెంట్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రాధికార సంస్థ ధ్రువీకరించింది. రూ.749 కోట్ల స్థిర, చరాస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఈడీ ఉత్తర్వులను ప్రాధికార సంస్థ సమర్థించింది.
2014 నుంచి ఈడీ పలు దఫాలుగా ఆయనకు చెందిన కోట్లాది రూపాయల స్థిర, చరాస్తులను జఫ్తు చేసుకుంది. అందులో భారతీ సిమెంట్సుకు చెందిన రూ.170 కోట్లు ఉన్నాయి. వాటిని అన్నింటిని ఇప్పుడు తమ అకౌంటులోకి బదలీ చేస్తున్నట్లు కొద్ది రోజుల కిందటే జగన్కు ఈడీ నోటీసులు జారీ చేసింది. శుక్రవారం సాయంత్రం సొత్తు స్వాధీనం ప్రక్రియను పూర్తి చేసింది.
ఇప్పటి దాకా ఈడీ ఆస్తులను అటాచ్ చేసుకుంది. ఆస్తులు అటాచ్ చేస్తే ఆయా కంపెనీల పేర్ల మీదనే ఉంటాయి. కానీ లావాదేవీలు నిర్వహించుకునే వీలు లేదు. కానీ ఇప్పుడు ఏకంగా భారతీ ఆస్తులను తమ ఖాతాల్లోకి మళ్లించుకోవడం గమనార్హం. ఇది ప్రభుత్వ ఖాతాల్లోకి వెళ్లనుంది.
జఫ్తు చేసిన ఆస్తులను దుర్వినియోగం చేసే అవకాశముందని భావిస్తే, అలాంటి అసాధారణ పరిస్థితులు ఎదురవుతాయనుకుంటే ఆస్తుల స్వాధీనానికి ఈడీ కోరుతుంది. అనుమతి రాగానే నోటీసులు ఇచ్చి, వెంటనే ఈడీ తమ ఖాతాలోకి జమ చేసుకుంది.
జగన్ హౌస్ మోషన్ పిటిషన్
భారతీ సిమెంట్ కంపెనీ తరఫు న్యాయవాదులు శనివారం హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ శనివారం అందుబాటులో లేరు. విశాఖలో ఉండటంతో హౌస్ మోషన్ పిటిషన్కు అనుమతి లభించలేదు. దీంతో వ్యాజ్యం సోమవారం హైకోర్టులో రెగ్యులర్ మోషన్లో విచారణకు రానుంది. కాగా, ఈ చర్యతో జగన్ శిబిరం దిగ్భ్రాంతికి గురైనట్లుగా తెలుస్తోంది.