గత ప్రభుత్వం-తెలంగాణ ఎఫెక్ట్: సీఎం రిలీఫ్ ఫండ్పై జగన్ స్పెషల్ ఫోకస్
హైదరాబాద్/అమరావతి: తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్లో భారీ అవకతవకలు జరిగాయాంటూ ఆరోపణలు వినిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న చర్యలు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎం రిలీఫ్ ఫండ్)ను పూర్తిగా ప్రక్షాళన చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు.
ఆస్పత్రులకు వందల కోట్ల బకాయిలు..
గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్కు సంబంధించిన దాదాపు 22వేలకు పైగా ఫైళ్లను పక్కనపడేశారు. అంతేగాక, వేలాది మందికి చెల్లని చెక్కులు కూడా ఇచ్చారు. దీంతో 2017 నుంచి రోగులకు వైద్యం చేసిన ఆస్పత్రులకు వందల కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం బకాయి పడాల్సి వచ్చిందని ఏపీ సీఎంవో వర్గాల సమాచారం.
గత ప్రభుత్వంలోలా కాకుండా..
గత ప్రభుత్వం ఇచ్చిన దాదాపు 8700 చెక్కులు బౌన్స్ కావడం గమనార్హం. ఎల్వోసీలు, రిఎంబర్స్మెంట్ మంజూరు చేయడంలో రాజకీయ, కుల వివక్ష చోటు చేసుకుందనే ఆరోపణలున్నాయి. 80శాతంపైగా సహాయ నిధిని కేవలం కొద్ది మంది నాటి టీడీపీ ఎమ్మెల్యేలు కొన్ని ఆస్పత్రులకే దోచిపెట్టాయని సీఎంవో వర్గాల ద్వారా తెలిసింది.
ఈ క్రమంలోనే సమర్థులు నిజాయితీపరులైన అధికారులు, సిబ్బంది పర్యవేక్షణలో ప్రతిపైసా అర్హులైన పేదలకు సీఎం రిలీఫ్ పండ్ చేరే విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని చెబుతున్నాయి. ముఖ్యమంత్రి సహాయ నిధి గత ప్రభుత్వంలో మాదిరిగా దుర్వినియోగం కాకూడదని పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నట్లు సంబందిత వర్గాలు తెలిపాయి.
కఠినంగానే..
ఈ క్రమంలోనే గతంలోని అక్రమాలను అరికట్టడానికి పాత బ్యాంక్ ఖాతాను మూసివేసి.. కొత్త అకౌంట్ను ప్రారంభించినట్లు చెప్పాయి. ఇక బ్రోకర్ల వ్యవస్థను పూర్తిగా అరికట్టేందుకు రోగుల బంధువులకే ఎల్ఓసీలు ఇస్తున్నారు. రోగులు ఇబ్బంది పడకుండా ఏ రోజు ఎల్ఓసీలు అదే రోజు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
లంచాలు, కమిషన్లు తీసుకుంటున్న వారిపై, బ్రోకర్లపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. దొంగ బిల్లులు పెడుతున్న వారిపై, ఆస్పత్రులపై పోలీసు కేసులు కూడా నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ఎలాంటి అవకతవకలు జరిగినా కఠినంగా చర్యలు తీసుకుంటున్నారు. దృష్టికి వచ్చిన అక్రమాలను విజిలెన్స్ విభాగానికి పంపుతున్నారు.
తెలంగాణ సర్కారుపై ఆరోపణల నేపథ్యంలో..
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దాదాపు 2421 ఎల్ఓసీలను, 2749 మెడికల్ రీఎంబర్స్మెంట్లు, 21 ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కలుపుకుని మొత్తం 5191 దరఖాస్తులను పరిశీలించి.. దాదాపు రూ. 52 కోట్లు మంజూరు చేసినట్లు సీఎంఓ వర్గాలు వెల్లడించాయి. అర్హులకు మాత్రమే సీఎం రిలీఫ్ ఫండ్ చేరేలా చూస్తున్నామని చెబుతున్నాయి. కాగా, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్లో భారీగా అవకతవకలు జరిగాయని, దాదాపు రూ. 80 కోట్లు పక్కదారి పట్టాయని జాతీయ మీడియాలో వార్తలు రావడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ఏపీలో జగన్ ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ప్రక్షాళన చేస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.