బీసీలు జడ్జిలు కావొద్దని చంద్రబాబు లేఖ, ఆ ఉప్పు హెరిటేజ్లో అమ్ముతున్నారు: జగన్
నరసాపురం: తన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై నరసాపురంలో నిప్పులు చెరిగారు. ఇదిగో వశిష్ట వారధి, అదిగో వశిష్ట వారధి అంటూ ఇక్కడి ప్రజలకు చంద్రబాబు ఓ సినిమా చూపిస్తున్నారన్నారు. ప్రతి ఎన్నికలప్పుడు చంద్రబాబుకు ఇది గుర్తుకు వస్తుందని, కానీ ఆ తర్వాత పట్టించుకోరన్నారు. మత్స్యకారులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయన్నారు.
జగన్ పక్కన పీకలు కోసే కృష్ణ, మోడీతో ఒప్పందం, చంద్రబాబూ! ఇంకా ఆశ వద్దు: జేసీ
చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక కొత్త బోట్లకు రిజిస్ట్రేషన్ ఆపేశారన్నారు. డీజిల్కు రాయితీ ఇవ్వాల్సి ఉంటుందని కొత్త బోట్లకు రిజిస్ట్రేషన్ ఇవ్వలేదన్నారు. మత్స్యకారులకు ఒక్క ఇల్లు ఇవ్వలేదన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే కొత్త బోట్లు ఇస్తామని, వేట విరామ సమయంలో వారికి నెలకు రూ.10వేలు, మత్స్యకారులు ప్రమాదవశాత్తు చనిపోతే బీమాకింద రూ.10 లక్షల ఎక్స్గ్రేసియా ఇస్తామన్నారు. బోట్లపై డీజిల్ సబ్సిడీకి ఇస్తామన్నారు.
బీసీలు జడ్జిలు కాకూడదంటూ చంద్రబాబు లేఖలు
చంద్రబాబుకు ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తుకు వస్తారని జగన్ అన్నారు. అమరావతి సినిమాలో వశిష్ట సినిమా కూడా చూపిస్తున్నారన్నారు. 2014లో ఇచ్చిన హామీల్లో 98 శాతం అమలు చేశామని చెబుతున్నారని, చెప్పనివి కూడా చేశామని చెబుతున్నారని, మరి రైతు రుణమాఫీ ఏమయిందన్నారు. చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ వడ్డీకైనా సరిపోతుందా అని ప్రశ్నించారు. బీసీలు జడ్జిలు కాకుండా చంద్రబాబు లేఖలు రాస్తారని మండిపడ్డారు. జస్టిస్ ఈశ్వరయ్య.. చంద్రబాబు లేఖను చూపించారన్నారు. బీసీలపై ఆయనకు ఉన్న ప్రేమ ఇది అన్నారు.
తెలంగాణలో అధికారంలోకి రాదు కాబట్టి సీఎం పదవి, మంత్రి పదవులు
తెలంగాణలో అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 12 మంత్రి పదవులు, బీసీలకు సీఎం పదవి అని చెబుతారని, కానీ ఏపీలో మాత్రం పదవులు ఇవ్వరని జగన్ అన్నారు. తెలంగాణలో టీడీపీ గెలిచే అవకాశాలు లేవు కాబట్టి అక్కడ బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తారన్నారు. ఏపీలో ఇవ్వకుండా తెలంగాణలో ఇస్తామని చెప్పడం కన్నా మోసం ఉంటుందా అన్నారు. టీడీపీ నిర్వహించిన మహానాడులో చెప్పినవి అన్నీ అసత్యాలే అన్నారు.
చంద్రబాబు ఇచ్చే మినరల్ వాటర్ అందుతున్నాయా?
ఏపీలో మినరల్ వాటర్ అందిస్తున్నామని మహానాడులో చంద్రబాబు చెప్పారని, మరి మీకు మినరల్ వాటర్ అందుతోందా అని ప్రజలను ఉద్దేశించి జగన్ ప్రశ్నించారు. మట్టి నీళ్లతో కూడిన బాటిల్ను ఆయన ప్రదర్శించారు. బెల్టు షాపులను రద్దు చేస్తామని చంద్రబాబు చెబుతున్నారని, కానీ మినరల్ వాటర్ లేని గ్రామాలు ఉన్నాయి కానీ బెల్టు షాపు లేని గ్రామం లేదన్నారు. మహానాడులో అన్నీ తిట్ల తీర్మానాలే అన్నారు.
అదే ఉప్పును హెరిటేజ్లో రూ.10కి అమ్ముతున్నారు
ప్రత్యేక హోదాతో ఒరిగేదేమీ లేదని 2017లో తీర్మానం చేసి, ఇప్పుడు మళ్లీ యూటర్న్ తీసుకున్నారన్నారు. మంత్రి లోకేష్ పప్పు అని మరోసారి నిరూపించుకున్నారన్నారు. ఒక్క పంటకైనా చంద్రబాబు గిట్టుబాటు ధర కల్పించారా అన్నారు. ఉప్పు బస్తాను దళారీలు రూ.1.70 పైసలకు కొంటున్నారని, అదే ఉప్పును ప్యాకింగ్ చేసి హెరిటేజ్లో రూ.10కి అమ్ముతున్నారన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే నవరత్నాలతో అందరి జీవితాల్లో సంతోషాన్ని నింపుతామన్నారు.