కేసీఆర్ను ఎందుకు నిలదీయడం లేదు: బాబుపై నిప్పులు చెరిగిన జగన్
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి పబ్లిసిటీ పిచ్చి ఎక్కువైందని వైసీపీ అధినేత వైయస్ జగన్ విమర్శించారు. రైతు సమస్యలపై అనంతపురం జిల్లా కలెక్టరేట్ ఎదుట మంగళవారం ఆయన ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే దాదాపు 16 లక్షల ఎకరాల వేరుశనగ వేశారని అన్నారు.
90 శాతం వేరుశనగ పంట ఎండిపోయిందని, రాయలసీమంతా కలిపి దాదాపు 21లక్షల 55వేల ఎకరాల్లో వేరుశనగ పంట వేశారని చెప్పారు. అనంతపురంలో దాదాపుగా మరో మూడు లక్షల ఎకరాలు వేరే పంటలు వేశారని అన్నారు. అనంతపురం జిల్లాలో ఆగస్టు చివరి వరకు వర్షాలు లేవని జగన్ పేర్కొన్నారు.
'రైతులు ఎంతో పంటని నష్టపోతే ఆగస్టు 28న చంద్రబాబు నాయుడు పుట్టపర్తికి వచ్చారు. కరవు ఉందా? నాకు తెలీదే నాకు చెప్పలేదే అని చంద్రబాబు అన్నారు. జిల్లాలో కరవు పరిస్థితి అలాగే ఉంది. వర్షాలు కూడా లేవు. వర్షాలు పడితే కానీ పంట పండని పరిస్థితి ఆరోజు ఉంది. కరవు పరిస్థితిని తెలుసుకోవడానికి మీ కంప్యూటర్లు పనిచేయడం లేదా?' అని అడిగారని అన్నారు.
'కంప్యూటర్ ద్వారా ప్రపంచంలోని అన్ని విషయాలు తెలుస్తాయని ఓ పక్క చెబుతుంటారు. మరోపక్క కరవు పరిస్థితి తెలియలేదు అంటున్నారు. ఓ పక్క కరవు ఉంటే మరోపక్క యుద్ధం చేశామని చెప్పుకున్నారు కరవు లేకుండా వెళ్లిపోయిందని చెబుతున్నారు. పబ్లిసిటీ పిచ్చి ఎక్కువయి సిగ్గు లేకుండా ఎన్నో ఎకరాలకు నీరందించామని చెబుతున్నారు' అని జగన్ వ్యాఖ్యానించారు.
ఈ రెండున్నరేళ్లలో చంద్రబాబు ఒక్కసారిక కూడా క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వలేదని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలను ఇచ్చి ఒక్కటీ నెరవేల్చలేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఇచ్చిన డబ్బులు వడ్డీలకు కూడా సరిపోదన్నారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. సెప్టెంబర్ 2న కరువుని జయించామని గొప్పలు చెప్పారన్నారు. సిగ్గులేకుండా నాలుగు రోజుల్లో 4 లక్షల ఎకరాల పంటను కాపాడామని అబద్ధాలాడుతున్నారని ధ్వజమెత్తారు. పులిచింతల, పోలవరం ప్రాజెక్టులను వైఎస్ఆర్ ప్రారంభారని తెలిపారు. పంటలకు మద్దతు ధర కోసం వైయస్ఆర్ ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని 250 మండలాల్లో కరువు తాండవిస్తోందని అన్నారు. వైఎస్ఆర్ అధికారంలోకి రాగానే ఉచిత విద్యుత్ పైలు పై సంతకం పెట్టారని అన్నారు. కేంద్రంపై వైయస్ఆర్ ఒత్తిడి తీసుకొచ్చి ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ తెచ్చేలా చేశారన్నారు. అందులో ఏపీలోని 16 జిల్లాలకు ప్యాకేజీకి వర్తింపజేశారు. చంద్రబాబు హౌసింగ్ స్కీంలు, సిమెంట్ రోడ్లతో ఉపాధి హామికి తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు.
ఎన్నికల ప్రచారసభల్లో రైతులకు న్యాయం చేస్తానని చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు వారి కష్టాలను పట్టించుకునే ప్రయత్నం కూడా చేయడం లేదన్నారు. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా రైతుల నోట్లో మట్టి కొట్టారన్నారు. మాధవరంలో చంద్రబాబు ఏ పొలంలోనయితే రెయిన్గన్స్ ప్రారంభించారో ఆ పొలమే ఇప్పుడు ఎండిపోయి కనిపిస్తోందన్నారు.
ఇన్పుట్ సబ్సిడీలో ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదన్నారు. పంట బీమా కూడా దక్కని పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిలదీయలేకపోతున్నారని అన్నారు. పాలమూరు, డిండి ప్రాజెక్టులను తెలంగాణ నిర్మిస్తోందని, గోదావరిపై కేసీఆర్ ప్రాజెక్టులను మొదలుపెట్టారని ఆయన అన్నారు.
గోదావరిపై ప్రాజెక్టులు కట్టి, అక్కడి నుంచి నీరు తన్నుకొని పోతోంటే కనీసం అడిగే పరిస్థితిలో కూడా చంద్రబాబు నాయుడు లేరని జగన్ మండిపడ్డారు. రైతులు నకిలీ విత్తనాల ద్వారా ఎంతో మోసపోయారని జగన్ అన్నారు. దానిపై కూడా రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిందని విమర్శించారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం మీకు వచ్చిందా? అని ఆయన రైతులను ప్రశ్నించారు.
'రైతులు బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని వేలం వేస్తున్నారు.. రైతుల రుణాలు బేషరతుగా మాఫీ చేస్తానని ఎన్నికల సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు. కనీసం మీ వడ్డీలయినా తీరాయా?' అని ప్రశ్నించారు. 'కరవు ఏర్పడి రైతులు అష్టకష్టాలూ పడుతోంటే.. మరోవైపు ముఖ్యమంత్రి ఏరియర్ సర్వే అంటూ హెలికాప్టర్లలో తిరుగుతున్నారు. ఏరియల్ సర్వే కాదు చేయాల్సింది.. కరవు వచ్చినప్పుడు ఆయా ప్రాంతాల్లో పర్యటించి, రైతులతో చర్చించి కష్టాలను అడిగి తెలుసుకోవాలి. వరదలు వచ్చినప్పుడు ఆయా ప్రాంతాల్లో పర్యటించే అవకాశం ఉండదు. అటువంటప్పుడు ఎవరయినా హెలికాప్టర్ ద్వారా పర్యటిస్తారు. కానీ, కరవు వచ్చినప్పుడు కూడా చంద్రబాబు ఏరియల్ పర్యటన చేస్తున్నారు' అని జగన్ ఎద్దేవా చేశారు.