భూసేకరణపై పోరు, 26న జగన్ ధర్నా: సెక్షన్ 8 అంటారని పార్థసారధి ఎద్దేవా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం బలవంతం భూసేకరణపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పోరుకు సిద్ధమవుతోంది. ఈ నెల 26వ తేదీన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సిఆర్డిఎ పరిధిలో ధర్నా నిర్వహించనున్నారు. పార్టీ నాయకుడు పార్థసారథి శనివారం మీడియా సమావేశంలో ఆ విషయం చెప్పారు.
తాము రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదని, అయితే బలవంతంగా భూసేకరణ జరపడాన్ని వ్యతిరేకిస్తున్నామని ఆయన చెప్పారు. ఏదైనా సమస్య వస్తే రెండు రాష్ట్రాల మధ్య తగాదాగా సృష్టిస్తారని, తమపై కేసులు వస్తే సెక్షన్ 8 అంటారని ఆయన ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి అన్నారు. మూడు పంటలు వేసే భూములను సేకరించవద్దని అంటే తప్పుడు అఫిడవిట్ దాఖలు చేస్తారని ఆయన అన్నారు.
మూడు పంటలు పండే భూములను మెట్ట భూములుగా చూపుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టులో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిందని ఆయన విమర్శించారు. ప్రజలు ఏమై పోయినా ఫరవాలేదు గానీ భూములు సేకరించాల్సిందేనని ప్రభుత్వం పట్టుబడుతోందని ఆయన అన్నారు. ఇప్పటికే 33 వేల ఎకరాలు సేకరించారని, 30 నుంచి 35 వేల ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉందని, దాదాపు 60 వేల ఎకరాలు రాజధాని కోసం సిద్ధంగా ఉన్నాయని చెబుతూ 3 వేల ఎకరాల సేకరణకు రైతుల గొంతు మీద ఆర్డినెన్స్ కత్తి పెడుతున్నారని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం, గవర్నర్ స్పందించాలని ఆయన కోరారు. చంద్రబాబు రైతులు, పేదల వ్యతిరేకి అని ఆయన అన్నారు.