'అందుకే కాపు రిజర్వేషన్లపై అలా': జగన్ ప్లాన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్!
అమరావతి: కాపు రిజర్వేషన్లపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ తేల్చి చెప్పడంపై ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప స్పందించారు. ప్రతిపక్ష నేత వ్యాఖ్యలను ఖండించారు. కాపుల పట్ల జగన్ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు.
తమకు రాజ్యాంగ పరిమితులు తెలుసు కనుకనే ఈ అంశానికి సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని చెప్పారు. కాపు రిజర్వేషన్లకు టీడీపీ కట్టుబడి ఉందని, కాపులపై జగన్కు సానుభూతి ఉంటే కేంద్రంపై పోరాడి ఇందుకు సంబంధించిన బిల్లును పాస్ చేయించాలన్నారు.
బీజేపీ వ్యతిరేకించడం వల్లే జగన్ చేతులెత్తేశారు
బీజేపీ వ్యతిరేకించడం వల్లే జగన్ కాపు రిజర్వేషన్లపై చేతులెత్తేశారని చినరాజప్ప ఎద్దేవా చేశారు. తమది మాట తప్పని వంశమని జగన్ అంటున్నారని, 2004లో కాపు, ముస్లీం రిజర్వేషన్లపై వైయస్ రాజశేఖర రెడ్డి మోసం చేయలేదా అని ప్రశ్నించారు. జగన్కు చిత్తశుద్ధి ఉంటే కేంద్రంతో పోరాడాలన్నారు.
Recommended Video
పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్
ఇదిలా ఉండగా, వైయస్ జగన్ తన తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో కాపు రిజర్వేషన్లపై చేతులెత్తేయడం పక్కా వ్యూహం ప్రకారమేననే వాదనలు వినిపిస్తున్నాయి. తాను కాపులకు రిజర్వేషన్లు ఇవ్వలేనని, అది రాష్ట్ర పరిధిలోని అంశం కాదని, 50 శాతం దాటితే సుప్రీం కోర్టు తీర్పు అడ్డు వస్తుందని, కాపు కార్పోరేషన్ నిధులైతే రెట్టింపు చేస్తానని జగ్గయ్యపేట సభలో జగన్ చెప్పారు. అయితే, కాపు రిజర్వేషన్లపై ఆయన హామీ ఇవ్వకపోవడానికి జనసేనాని పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ కారణం కావొచ్చునని అంటున్నారు.
జనసేన వైపు ఉంటారనే అభిప్రాయం
గోదావరి జిల్లాల్లో పవన్ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువ. 2014లో ఆయన మద్దతు కారణంగానే టీడీపీ ఈ రెండు జిల్లాల్లో దాదాపు అన్ని స్థానాల్లో గెలిచింది. ఇప్పుడు పవన్ ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. రిజర్వేషన్లపై హామీ ఇచ్చినా, ఇవ్వకపోయినా ఆ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా జనసేనకు పడతాయనే అభిప్రాయంతో వైసీపీ అధినేత ఉన్నారని అంటున్నారు.
రెండు వైపులా నష్టపోకుండా
కాపు రిజర్వేషన్ల హామీలపై ఇప్పటికే బీసీలు ఆగ్రహంతో ఉన్నారు. కాపులకు హామీ ఇస్తే నష్టమే తప్ప లాభం ఉండదనే ఉద్దేశ్యంతోనే జగన్ తేల్చి చెప్పారని అంటున్నారు. ఓ వైపు కాపు ఓట్లు ఎలాగు జనసేన వైపు ఉంటాయి, మరోవైపు హామీ ఇస్తే బీసీల ఆగ్రహం చవిచూడాల్సి ఉంటుందనే ఉద్దేశ్యంతో.. ఎన్నికలకు ముందు స్పష్టంగా చెప్పారని అంటున్నారు. రెండు వైపుల నష్టం కంటే.. ఆ డిమాండ్పై స్పష్టత ఇస్తే లాభం ఉంటుందనే జగన్ వ్యూహాత్మకంగా ఈ ప్రకటన చేసి ఉంటారని అంటున్నారు.