లేఖ రాస్తే సమైక్యానికి తొలి సంతకం నాదే: జగన్
హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సమైక్యాంధ్ర జెఎసి లేఖ రాస్తే దానిపై తొలి సంతకం తానే పెడుతానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. శనివారంనాడు సీమాంధ్ర న్యాయవాదులు జగన్ను ఆయన నివాసంలో కలిశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. బెయిల్పై చంచల్గుడా జైలు నుంచి విడుదలైన తర్వాత మీడియాతో జగన్ మాట్లాడడం ఇదే తొలిసారి.
అందరి ఆమోదం లేకుండా కేంద్రం రాష్ట్రాన్ని విభజిస్తోందని, దాన్ని అడ్డుకోవాలని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ ప్రజలు రోడెక్కినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. కేవలం ఓట్లు, సీట్ల కోసమే తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు కలిసి రాష్ట్రాన్ని విభజిస్తున్నాయని ఆయన అన్నారు.
రాష్ట్రాన్ని విభజిస్తే పది జిల్లాలో తన్నుకునే పరిస్థితి వస్తుందని, న్యాయం చేయలేనప్పుడు కొట్టుకునే పరిస్థితి వస్తుందని జగన్ సమైక్యాంధ్ర న్యాయవాదులను ఉద్దేశించి ప్రసంగిస్తూ అన్నారు. నిజాయితీగా విభజనను అడ్డుకోవాలని ఆయన అన్నారు. ఓట్లు సీట్లు పోతాయని మౌనంగా ఉండడం మంచిది కాదని, విభజనను ఆపకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఆయన అన్నారు.
రెండు రాష్ట్రాలుగా విడిగొడితే నీళ్లు ఎలా ఇస్తారని ఆయన అడిగారు. నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాలకు నీళ్లు ఎలా వస్తాయని ఆయన అన్నారు. కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు మంచి నీళ్లు ఎవరు ఇస్తారని ఆయన ప్రశ్నించారు. చదువుకున్న ప్రతి కుర్రాడు హైదరాబాద్ వైపే చూస్తున్నాడని, రాష్ట్రం ఆదాయంలో సగం హైదరాబాద్ నుంచే వస్తోందని, అదే ఆగిపోతే జీతాలు ఎలా ఇస్తారని ఆయన అన్నారు.
పంపకాల్లో తండ్రి పిల్లలకు న్యాయం చేయాలని, న్యాయం చేయలేనప్పుడు యధావిధిగా వదిలేయాలని ఆయన అన్నారు. సిపిఎం, మజ్లీస్, వైయస్సార్ కాంగ్రెసు సమైక్యాంధ్ర కోరుతున్నాయని ఆయన అన్నారు. మిగిలిన పార్టీలు కూడా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఆయన అన్నారు.