జగన్ కాలికి బొబ్బలు.. చూసి తట్టుకోలేక పోయిన భారతి, వైయస్సార్కీ ఇలాగే!
అమరావతి/కర్నూలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 22వ రోజుకు చేరుకుంది. కోర్టు విచారణ నేపథ్యంలో శుక్రవారాలు మినహా మిగితా వారాల్లో ఆయన తన పాదయాత్రను నిర్వీరామంగా కొనసాగిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి కాళ్లకు బొబ్బలు వచ్చాయి. అంతేగాక ఓ కాలులో ముల్లు కూడా గుచ్చుకుంది. దీంతో ఆయన కొంత ఇబ్బంది పడ్డారు. ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు వైద్యులు.
తట్టుకోలేకపోయిన భారతి
అయితే, వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని చెప్పినప్పటికీ.. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను కొనసాగించేందుకే మొగ్గు చూపడం గమనార్హం. ఇది ఇలావుంటే.. విషయం తెలుసుకున్న జగన్ సతీమణి వైయస్ భారతి అక్కడకు చేరుకున్నారు. తన భర్త కాళ్లకు ఉన్న బొబ్బలను చూసి తట్టుకోలేకపోయారు. బొబ్బలు తీవ్రంగా ఉండటంతో ఆమె ఆందోళన చెందారు.
వైయస్సార్కి ఇలాగే..
గతంలో దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసిన సమయంలోనూ ఆయనకు ఇలాగే బొబ్బలు రావడం గమనార్హం. కాగా, ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైయస్ జగన్ని గురువారం వెలుగు యానిమేటర్లు కలిశారు. డ్వాక్రా సంఘాలను టీడీపీ సర్కార్ నిర్వీర్యం చేసిందని, యానిమేటర్లకు కనీస వేతనం కూడా ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. యానిమేటర్లకు కనీస వేతనం కూడా ఇవ్వడం లేదని అన్నారు. అధికారంలోకి వచ్చాక వెలుగు యానిమేటర్లకు నెలకు రూ.10వేలు జీతం ఇస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.
జీతాలు పెంచుతా..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పొదుపు సంఘాలు చంద్రబాబు సర్కార్ హయాంలో నిర్వీర్యం అయ్యాయి. అలాంటి పొదుపు సంఘాలను నిలబెట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్న యానిమేటర్లు... తమ జీతాలు పెంచాలని కోరుతున్నారు. పక్కన తెలంగాణలో రూ.5వేలు ఇస్తున్నారని, కనీస పారితోషికం ఇవ్వాలని ప్రభుత్వాన్ని అడిగినా ఫలితం లేదు. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వస్తే అయిదు వేలు కాదు... రూ.10వేలు ఇస్తాం.' అని తెలిపారు. వైఎస్ జగన్ హామీతో పొదుపు సంఘాల యానిమేటర్లు హర్షం వ్యక్తం చేశారు.
23వ రోజు షెడ్యూల్ ఇదే
ప్రజాసంకల్పయాత్ర 23వ రోజు షెడ్యూల్ విడుదల అయ్యింది. ఆయన శుక్రవారం ఉదయం ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం బిల్లకల్ నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. జుటూర్, చిన్న హుల్తి చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు పత్తికొండలో భోజన విరామం తీసుకుంటారు. అనంతరం పత్తికొండ అంబేద్కర్ సర్కిల్ నుంచి ప్రజాసంకల్పయాత్రను పున:ప్రారంభిస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు పత్తికొండలోని ఊరు వాకిలి సెంటర్ వద్ద బహిరంగ సభలో వైయస్ జగన్ ప్రసంగిస్తారు.