వైఎస్ జగన్ ప్రమాణ స్వీకార ఏర్పాట్లు ఆరంభం: విజయవాడ నిండా ఎల్ఈడీ స్క్రీన్లు
అమరావతి: రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆదివారం ఉదయం ఏర్పాట్లు ఆరంభం అయ్యాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 30వ తేదీన మధ్యాహ్నం 12:23 నిమిషాలకు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. విభజన తరువాత ఏర్పాటైన రాష్ట్రానికి వైఎస్ జగన్ రెండవ ముఖ్యమంత్రి.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సహా కొంతమంది మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారానికి తాను హాజరు కానున్నట్లు కేసీఆర్ ఇదివరకే తెలిపారు. నరేంద్ర మోడీ వస్తారా? లేద? అనేది ఇంకా తెలియ రావాల్సి ఉంది. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ వైఎస్ జగన్ ఆదివారం సతీ సమేతంగా.. కేసీఆర్ ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే.
అనంతరం సోమవారం ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లారు. ప్రధానిని కలిశారు. రెండోసారి ప్రధానమంత్రిగా ఎన్నికైనందుకు మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, లోక్సభకు ఎన్నికైన మిథున్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, నందిగాం సురేష్, వల్లభనేని బాలశౌరి, రాజ్యసభ సభ్యులు వీ విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు.
కాగా- వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పార్టీ అభిమానులు, కార్యకర్తలు తరలిరానున్నారు. కనీసం ఆరు లక్షల మంది వరకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అక్కడ ఏర్పాట్లను ఆరంభించారు. ప్రొటొకాల్ విభాగం అధికారులు ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం సామర్థ్యం పరిమితం. వచ్చిన వారందరూ స్టేడియంలోనికి వెళ్లలేరు. స్టేడియం లోనికి ప్రవేశించే వారి కోసం పాసులను జారీ చేస్తున్నారు విజయవాడ పోలీసులు. 25 వేల మందికి పాసులు ఇస్తున్నారు. పాసులు ఉంటేనే స్టేడియం లోనికి వెళ్లడానికి అనుమతి ఇస్తారు.
మిగిలిన వారి కోసం విజయవాడ నగర వ్యాప్తంగా పలు చోట్ల తాత్కాలికంగా భారీ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన కూడళ్లలో మొబైల్ ఎల్ఈడీ స్క్రీన్లను అందుబాటులోకి తీసుకుని రానున్నారు. ప్రధాన కూడళ్లతో పాటు విజయవాడ నగర శివార్లలోనూ మొబైల్ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తారు. వాహనాల రాకపోకలు స్తంభించడం వల్ల నగరంలోనికి ప్రవేశించడానికి సాధ్యం కాని నాయకులు, అభిమానుల కోసం ఈ ఏర్పాటు చేశారు.