ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన: కేంద్రమంత్రికి కీలకాంశాలపై వినతి
న్యూఢిల్లీ: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండ్రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. శుక్రవారం ఢిల్లీలో కేంద్రమంత్రులను కలిసి ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమైన సీఎం జగన్మోహన్ రెడ్డి.. శనివారం కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్తో సమావేశమయ్యారు.
రాధాని కార్యకలాపాలు, అభివృద్ధి వికేంద్రీకరణ అంశాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు జగన్. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం రాజధాని కార్యకలాపాలను మూడు ప్రాంతాలకు వికేంద్రీకరించామని, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు, పరిపాలనా రాజధానిగా అమరావతి ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్కు సీఎం జగన్ వివరించారు.
మూడు రాజధానుల బిల్లు-2020కి అసెంబ్లీ ఆమోద ముద్ర వేసిందని కేంద్రమంత్రికి తెలిపారు. ఇందులో భాగంగా హైకోర్టును కర్నూలుకు తరలించడానికి కేంద్ర న్యాయశాఖ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాయలసీమ ప్రాంతంలో శాశ్వత ప్రాతిపదికన హైకోర్టును ఏర్పాటు చేస్తామంటూ బీజేపీ 2019 మేనిఫెస్టోలో పేర్కొన్న విషయాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పాటు శాసనమండలి రద్దు అంశాన్ని కూడా కేంద్రమంత్రితో సీఎం జగన్ చర్చించారు. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులను శాసనమండలి అడ్డుకునే ప్రయత్నం చేసి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని కేంద్రమంత్రికి వివరించారు. ఈ నేపథ్యంలోనే మూడింట రెండొంతుల మెజార్టీతో ఏపీ అసెంబ్లీ.. శాసనమండలిని రద్దు చేస్తూ తీర్మానం చేసిందని, అందుకు అనుగుణంగా కేంద్ర న్యాయశాఖ తదుపరి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అంతేగాక, మహిళలు, చిన్నారులపై నేరాలను అరికట్టేందుకు ఏపీలో దిశ చట్టాన్ని తీసుకొచ్చినట్లు కేంద్రమంత్రికి జగన్ వివరించారు. వీలైనంత త్వరగా దిశ చట్టం అమల్లోకి తీసుకొచ్చేందుకు న్యాయప్రక్రియకు చర్యలు తీసుకోవాలని రవిశంకర్ ప్రసాద్ను కోరారు. కాగా, ఏపీ సీఎం జగన్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన అంశాలపై కేంద్రమంత్రులు సానుకూలంగా స్పందించినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.