బాబులా చేస్తే పిచ్చోడంటారు! ‘నారాయణ’ ఫీజు బాదుడుకు గంటా గ్రీన్ సిగ్నల్: జగన్
విశాఖపట్నం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సర్కారు విధానాలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 264వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా భీమిలి ఆనందపురం జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు.
రౌడీ రాజ్యం! జేసీ బ్రదర్స్కి చంద్రబాబు ప్రోత్సాహం: తాడిపత్రి ఘటనపై జగన్, భక్తులకు భరోసా
బాబు, గంటా ఆధ్వర్యంలో కబ్జాలు
భీమిలి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఎక్కడ భూములు కనిపించినా కబ్జా చేస్తున్నారని వైయస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడి పాలనపై మండిపడ్డారు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు ఇక్కడ అధికార పార్టీ నేతలు భూములను దోచేస్తున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. మంత్రి గంటా శ్రీనివాసరావు, సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో భూ కబ్జాలు సాగుతున్నాయని ధ్వజమెత్తారు. వీరిద్దరు భూ కబ్జాల్లో ఆరితేరిపోయారని మండిపడ్డారు.
నారాయణ ఫీజు బాదుడుకు గంటా గ్రీన్ సిగ్నల్
‘మంత్రి గంటా వియ్యంకుడు నారాయణ. ఆయన విద్యాసంస్థల్లో ఫీజులు బాదుడే బాదుడు. పెంచడానికి మంత్రి గంటా గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. ఇదే నారయణ కాలేజీల్లో సుమారు 30 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. కాలేజీలు మూసేయించాల్సిన మంత్రి మౌనం వహిస్తారు. ప్రభుత్వ విద్యాసంస్థలను నిర్వీర్యం చేసి నారయణ విద్యాసంస్థలను ప్రోత్సహిస్తారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్ట్లను భర్తీ చేయకుండా నిర్వీర్యం చేసి చంద్రబాబు బంధువైన ఎంవీవీఎస్ మూర్తి గీతం యూనివర్సిటీకి వెళ్లేలా ప్రోత్సహిస్తారు' అని జగన్ అన్నారు.
ఉద్యోగాలని చెప్పి.. 53కోట్లు తినడానికే..
‘చిట్టివలస జ్యూట్ మిల్లులో 6 వేల మంది పనిచేసేవారు. ఎన్నికలకు ముందు మంత్రి గంటా నెలరోజుల్లో ఈ మిల్లును తెరిపిస్తానని హామీ ఇచ్చారు. నాలుగున్నరేళ్లయినా ఇంత వరకు ఆ జ్యూట్ మిల్లు తెరుచుకోలేదు. కార్మికులకు రూ.119 కోట్లు బకాయి పడ్డారు. ఈ జ్యూట్ మిల్లుకు ఉన్న రెండెకరాల గోడౌన్ స్థలాన్ని వేరే వ్యక్తుల చేత కొనుగోలు చేయించారు. ఆ సొమ్ము అన్నా కార్మికులకు ఇచ్చారా అంటే.. అది లేదు. ఆ డబ్బులతో వ్యాపారం చేస్తారు. విశాఖ సమ్మిట్ పేరిట మూడు రోజులు తినడానికే రూ. 53 కోట్లు ఖర్చు పెట్టారు. 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. ఉత్తరాంధ్రలో 35 జ్యూట్ మిల్లులు ఉంటే దాదాపు 50 వేల మందికి ఉపాధి కలుగుతోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత కేవలం 18 జ్యూట్ మిల్లులు మాత్రమే నడుస్తున్నాయి. దీంతో ఏకంగా 30 వేల మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కరెంట్ యూనిట్కు రూ. 3.15 పైసలు ఉండేది. ఈ పెద్దమనిషి వచ్చిన తరువాత అదే యూనిట్ ధరను రూ. 8.40 రూపాయలకు పెంచారు. ఇలా పెంచితే జ్యూట్ మిల్లులు మూతపడక ఏం చేస్తాయని చంద్రబాబు అని అడుగుతున్నా? ' అని జగన్ అన్నారు. చంద్రబాబు సర్కారు.. విశాఖ జిల్లాకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని జగన్ మండిపడ్డారు.
బాబులా చేస్తే పిచ్చోడంటారు
‘పోలవరం పనులను చూస్తే పునాది గోడలు దాటవు. చంద్రబాబు మాత్రం కుటుంబ సభ్యులతో గ్యాలరీ వాక్ చేస్తారు. పునాదులు వేసి గృహ ప్రవేశానికి పిలిస్తే పిచ్చోడంటారు. ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబే కారణం. ఇప్పుడు ధర్మ పోరాట దీక్షలతో కొత్త డ్రామాలాడుతున్నారు. చంద్రబాబు పాలనలో ఆరోగ్య శ్రీ నిర్వీర్యమైంది. ఆపరేషన్ కోసం హైదరాబాద్కు వెళ్తే ఆరోగ్య శ్రీ వర్తించదంటున్నారు. మీ అందరి ఆశీస్సులతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. ప్రతి పేదవాడికి చికిత్స రూ. వెయ్యిదాటితే ఆరోగ్య శ్రీ కిందకు తీసుకొస్తాం. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు సహా ఎక్కడ ఆపరేషన్ చేయించుకున్నా ఆరోగ్య శ్రీ వర్తింపజేస్తాం. ఆపరేషన్ చేశాక విశ్రాంతి సమయంలో పేషెంట్కు ఆర్థికసాయం అందిస్తాం. మరో ఆరునెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. మీ మనస్సాక్షికి తగ్గట్లు ఓటేయండి. అధికారంలోకి వస్తే నవరత్నాలతో అన్ని వర్గాలను ఆదుకుంటాను' అని వైఎస్ జగన్ ప్రజలను కోరారు. కాగా, పాదయాత్ర ప్రాంతంలో భారీ వర్షం కురిసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రను కొనసాగించడం గమనార్హం.