అసమర్థ చంద్రబాబు ఏం చేస్తున్నారంటే? తెలంగాణ బెటర్: ఏకేసిన జగన్
పశ్చిమగోదావరి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 167వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా తాడేపల్లిగూడెం మార్కెట్ సెంటర్లో సోమవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
గత ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టీడీపీని గెలిపించినందుకు ప్రతిగా.. చంద్రబాబు ఇక్కడి ప్రజలను మోసం చేశారని, సహజ వనరులను దోపిడీ చేశారని జగన్ ఆరోపించారు. దోపిడీలకు పాల్పడటమేకాక.. టీడీపీ ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, జన్మభూమి కమిటీలకూ ఎలా దోచుకోవాలో చంద్రబాబు ట్రైనింగ్ ఇస్తున్నారని మండిపడ్డారు. ఇసుక నుంచి పోలవరం కాంట్రాక్టుల దాకా అన్నింటా దోపిడీల పర్వం కొనసాగుతున్నదని ఆరోపించారు.
రోడ్డైనా వేశారా?
‘2014 ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు టీడీపీకే అన్ని సీట్లూ ఇచ్చారు. మరి ఈ నాలుగేళ్ల పాలనలో సీఎం చంద్రబాబు ఈ జిల్లాకు ఏమిచ్చారు? మరీ తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి ఏం చేశారు? తాడేపల్లిగూడెంలో ఎయిర్పోర్టు కడతామన్నారు.. కనీసం రోడ్డైనా వేయలేదు!' అంటూ జగన్ ఎద్దేవా చేశారు.
చంద్రబాబు అసమర్థతకు నిదర్శనం
అంతేగాక, ‘నల్లజర్ల నుంచి తాడేపల్లి, తాడేపల్లి-భీమవరం, కైకలూరు-ఏలూరు రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో చూస్తున్నాం. నాలుగేళ్లలో ఇక్కడ ఒక్క కాలేజీ కూడా కట్టలేని ఆయన.. కేంద్రం ఇచ్చిన ఎన్ఐటీకి కనీసం కాంపౌండ్ వాల్ కూడా కట్టలేదు. వైయస్సార్ హయాంలో మంజూరైన తాడేపల్లిగూడెం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పనులు పూర్తిచేయలేని అసమర్థుడు చంద్రబాబు. ఉద్యానవన యూనివర్సిటీకి వీసీని కూడా నియమించలేదు. ఇక పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నవైనం జిల్లా వాసులుగా మీకు తెలిసిందే' అని జగన్ చెప్పుకొచ్చారు.
రౌడీయిజంలో ట్రైనింగ్..
‘ప్రజలకు అవసరమైన పనులు చేయకపోగా, బాబు తన ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఇస్తాడు.. ఎందులో ట్రైనింగ్ అంటే.. రౌడీయిజం, అధికారులపై దౌర్జన్యం, ఆడవాళ్లను జుట్టుపట్టి ఈడ్చడం, మట్టిని, ఇసుకను అక్రమంగా తొవ్వుకోవడం, కాంట్రాక్టర్ల దగ్గర్నుంచి కమిషన్లు లాగడం లాంటివి ట్రైనింగ్ ఇస్తాడు. టీడీపీ ఎమ్మెల్యేలు, వాళ్ల కింద జన్మభూమి కమిటీలు ఆ ట్రైనింగ్ ప్రకారమే జనాన్ని దోచుకుతింటున్నారు' అని చంద్రబాబుపై జగన్ మండిపడ్డారు.
తెలంగాణే బెటర్..
మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడే పోలవరం సబ్ కాంట్రాక్టర్ అని చెప్పారు. నామినేషన్ పేరుతో బినామీ కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ నీటి ప్రాజెక్టులు ఎంతో వేగంగా జరుగుతున్నాయని, ఇక్కడ మాత్రం నడకనసాగుతున్నాయని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. అంతేగాక, తెలంగాణలో ఆయిల్ పామ్ రైతులకు రూ.1000 ఎక్కువగా మద్దతు ధర లభిస్తుంటే.. ఏపీలో మాత్రం అంతే మొత్తం తక్కువ ఇస్తున్నారని అన్నారు.