ఇదీ మన మీడియా, సీట్ల సర్వే 'ఈనాడు'కు కనిపించదు: అన్నీ చెప్పి దుమ్మెత్తిపోసిన జగన్
చీపురుపల్లి: ఈనాడు, ఆంధ్రజ్యోతిలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎల్లో మీడియా అంటూ విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గం గుర్లలో ఆదివారం తీవ్రస్థాయిలో దుమ్మెత్తి పోశారు. ఇదీ మన మీడియా పరిస్థితి అంటూ ప్రత్యేక హోదా మొదలు, ఇటీవల వచ్చిన ఏబీపీ - సీ ఓటరు సర్వే వరకు జరిగిన అంశాలను వెల్లడించారు.
Recommended Video
జగన్ విశాఖ వెళ్లాడు కానీ: పవన్ కళ్యాణ్కు గంటా శ్రీనివాస రావు సలహా
ఎల్లో మీడియా తీరు ఎలా ఉందంటే ప్రత్యేక హోదా సంజీవని అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదయం అంటే, అవును సంజీవిని అని చెబుతారని, ప్రత్యేక హోదా సంజీవిని కాదని, ఈశాన్య రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయని చంద్రబాబు మధ్యాహ్నం అంటే, మధ్యాహ్నానికే ఎల్లో మీడియా ప్లేటు మార్చి సంజీవిని కాదని చెబుతుందని, ఆ తర్వాత చంద్రబాబు రాత్రి పడుకొని నిద్ర లేచాక ప్లేటు మార్చి హోదా వద్దని తాను చెప్పలేదని, ఎప్పుడూ ఆరాటపడుతున్నానని చెబితే, అదే ఎల్లో మీడియా హోదా కోసం చంద్రబాబు రాత్రింబవళ్లు కష్టపడ్డారని రాస్తుందని జగన్ ఎద్దేవా చశారు.
చంద్రబాబు నంది అంటే నంది, పంది అంటే పంది
ఎల్లో మీడియా తీరు ఎలా ఉందంటే, చంద్రబాబు ఏది చెబితే అదే సై అంటుందని జగన్ విమర్శించారు. చంద్రబాబు మూడుసార్లు హోదాపై ప్లేటు మార్చారని, కానీ దానిని ఎల్లో మీడియా ప్రదర్శించందని నిప్పులు చెరిగారు. చంద్రబాబు నందిని చూపించి పంది అంటే అవునని అంటుందని, నక్కను చూపించి నంది అంటే అవునను అంటుందని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టినా ఎల్లో మీడియా ప్రశ్నించదన్నారు. కానీ చంద్రబాబు కోసం ఏం చేయమన్నా చేస్తుందన్నారు.
ఎమ్మెల్యేను కొన్నా ఎల్లో మీడియాకు పట్టదు
ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం కేంద్రంలో టీడీపీ నేతలు మంత్రులుగా ఉండి రాజీనామా చేయకుంటే ఎల్లో మీడియాకు తప్పుగా కనిపించదని జగన్ అన్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.25 నుంచి రూ.30 కోట్లు ఇచ్చి సంతలో పశువులను కొన్నట్లు కొంటే ఎల్లో మీడియాకు తప్పుగా అనిపించదన్నారు.
బీజేపీకి జై కొడితే బీజేపీకి, కాంగ్రెస్కు జై కొడితే కాంగ్రెస్కు
చంద్రబాబు బీజేపీకి జై అంటే ఎల్లో మీడియా జై అంటుందని, కాంగ్రెస్ పార్టీకి జై కొడితే అప్పుడూ జై కొడుతుందని జగన్ ఎద్దేవా చేశారు. ఎల్లో మీడియా కేవలం రాయడమే కాకుండా చంద్రబాబుతో కలిసి ఇతరులపై బురద కూడా జల్లుతుందని విమర్శించారు. చంద్రబాబు లక్షలకోట్లు దోపిడీ చేసినా ఆ దోపిడీని అభివృద్ధిగా ఎల్లో మీడియా చూపుతుందన్నారు. పోలవరం కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టినా ఢిల్లీలో చంద్రబాబు చక్రం తిప్పినట్లు ఎల్లో మీడియా రాస్తుందన్నారు.
చంద్రబాబు ఏం చేసినా పొగడటమే
చంద్రబాబు బీజేపీ ఒళ్లో కూర్చొనీ దీక్ష చేస్తే ఎల్లో మీడియా పొగుడుతుందని, కాంగ్రెస్ ఒళ్లో కూర్చొని చంద్రబాబు దీక్ష చేస్తే ధర్మపోరాట దీక్ష అంటుందని జగన్ విమర్శఇంచారు. చంద్రబాబు ఏం చేసినా పొగడాలనేదే ఎల్లో మీడియా ఉద్దేశ్యం అన్నారు. ఇదీ మన మీడియా పరిస్థితి అన్నారు.
ఆ సర్వే ఈనాడుకు కనిపించదు
ఎల్లో మీడియాకు రెండు రోజుల క్రితం వచ్చిన ఏబీపీ - సీ ఓటరు సర్వే కనిపించలేదని జగన్ మండిపడ్డారు. ఈ సర్వే ప్రకారం ఏపీలో ఎన్నికలు జరిగితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 21 లోకసభ స్థానాల్లో, టీడీపీ కేవలం 4 స్థానాల్లో గెలుస్తుందని తేలిందని, కానీ ఈనాడు పత్రికకు అది కనిపించదన్నారు. ఈ సర్వేపై ఈనాడులో ఎలా వచ్చిందో చెప్పారు. ఈనాడులో ఎక్కడా వైసీపీకి 21 సీట్లు, టీడీపీకి 4 సీట్లు వస్తాయని ఇవ్వలేదని అన్నారు. కానీ మళ్లీ అధికారంలోకి ఎన్డీయే వస్తుందని మాత్రం కనిపించిందన్నారు. చంద్రబాబుకు ఎన్ని సీట్లు వస్తాయనేది మాత్రం ఇవ్వలేదన్నారు.
ఎడిటింగ్ చేసి వార్తలు
చంద్రబాబుకు ఏం కావాలో అలా ఎడిటింగ్ చేసి ఎల్లో మీడియా వార్తలు రాస్తుందని జగన్ దుమ్మెత్తి పోశారు. ఎడిటింగ్ చేసి వార్తలు వస్తున్నాయంటే అర్థం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో అన్యాయ పాలన సాగుతోందని, కానీ ప్రజల తరఫున ఎల్లో మీడియా దీనిని ప్రశ్నించదన్నారు. ఎందుకంటే అది అమ్ముడుపోయిందని ఆరోపించారు. ఏపీలోని దయనీయ పరిస్థితి కనిపించదని, ఎల్లో మీడియాకు సర్వే కూడా కనిపించలేదన్నారు.