'కడప'పై చంద్రబాబు పావులు, జగన్తో గేమ్లో ఆదిలో హంసపాదు?
కడప: తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు కారు ఎక్కుతున్నారు. మరోవైపు, ఏపీలో కూడా కొందరు వైసిపి ఎమ్మెల్యేలు టిడిపిలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా కడప జిల్లా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సైకిల్ ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నారు.
కడపలో వైయస్ జగన్కు బలం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ టిడిపి బలం పెంచుకునే ఉద్దేశ్యంలో భాగంగానే చంద్రబాబు.. ఆదినారాయణ రెడ్డిని పార్టీలోకి తీసుకునేందుకు సిద్ధమయ్యారు. తద్వారా 2019 ఎన్నికల నాటికి జగన్కు ఆయన సొంత జిల్లా కడపలోనే షాకివ్వాలని బాబు పావులు కదుపుతున్నారు.
అయితే, జగన్ను సొంత జిల్లాలో దెబ్బతీయాలనే చంద్రబాబు ఆలోచనకు ఆదిలోనే దెబ్బ తగులుతోంది. టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి రామసుబ్బా రెడ్డి నిరసన గళం వినిపిస్తున్నారు. తన అభ్యంతరాలను పెడచెవినబెట్టి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దంటున్నారు.
తనకు గౌరవం ఉన్నంత వరకే పార్టీలో కొనసాగుతానని చెప్పడం ద్వారా... తాను పార్టీ వీడటం ఖాయమన్న సంకేతాలు రామసుబ్బారెడ్డి ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. రామసుబ్బా రెడ్డి చేసిన పరోక్ష వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.
ఇప్పటికే టిడిపిలోకి పెద్ద ఎత్తున వైసిపి ఎమ్మెల్యేలు చేరుతారన్న ప్రచారాన్ని జగన్ తనదైన తీరులో తిప్పికొట్టారు. అసలు టిడిపిలోకి ఎవరు వెళ్తారని, తమ పార్టీలోకి టిడిపి నేతలు వస్తారని, తనతో టిడిపి ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని, వారి పేర్లు చెబితే ప్రభుత్వం పడిపోవడం ఖాయమని జగన్ వ్యాఖ్యానించారు.
ఆరు నుంచి తొమ్మిది మంది వైసిపి ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతారని ఇటీవలి వరకు జోరుగా వార్తలు వచ్చాయి. ఇది టిడిపి మైండ్ గేమ్ అని, తమ పార్టీకి చెందిన వారు ఎవరూ సైకిల్ ఎక్కరని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్పష్టం చేస్తూ వస్తున్నారు.