జగన్ సమైక్య శంఖారావం: 30న బాబు ఇలాకాలోనే..
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమైక్య శంఖారావం పర్యటన ఖరారైంది. ఆయన నవంబర్ చివరి వారంలో ఈ సమైక్య శంఖారావాన్ని ప్రారంభించాలని అనుకున్నారు. కానీ అది వాయిదా పడింది. ఈ నెల 30వ తేదీన చిత్తూరు జిల్లా కుప్పంలో సమైక్య శంఖారావం నిర్వహించాలని ఆయన నిర్ణయించుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి శానససభా నియోజకవర్గం కుప్పం అనే విషయం తెలిసిందే.
కుప్పంలో జరిగే బహిరంగ సభలో జగన్ సమైక్యాంధ్ర ప్రదేశ్ ఆవశ్యకత గురించి ప్రసంగిస్తారు. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకు జగన్ చిత్తూరు జిల్లాలోకి ప్రవేశిస్తారు. తన ఓదార్పు యాత్రలో భాగంగా వైయస్ రాజశేఖర రెడ్డి అకాల మరణానికి బెంగటిల్లి మరణించినవారి కుటుంబాలను పరామర్శిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు కుప్పం చేరుకుని అక్కడి బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
వైయస్ జగన్ కుప్పం బహిరంగ సభకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన బెంగళూర్ నుంచి చిత్తూరు జిల్లాకు చేరుకుంటారు. జగన్ బహిరంగ సభ ఏర్పాట్లను సమీక్షించడానికి బుధవారం పార్టీ కార్యకర్తలు సమావేశమయ్యారు.
తొలి రోజు 30వ తేదీన ఆయన కుప్పం నియోజకవర్గంలోని పైపాళ్యంలో వెంకటేష్ కుటుంబ సభ్యులను ఓదారుస్తారు. ఆ తర్వాత ఎనగాంపల్లె, తంబిగానిపల్లెల్లో వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను ఆవిష్కరిస్తారు. కుప్పంలో సమైక్య శంఖారావం సభానంతరం ఆయన కంచిబదార్లపల్లెలో లక్ష్మి కుటుంబాన్ని ఓదారుస్తారు. ఆ తర్వాత ఆయన పలమనేరుకు బయలుదేరి వెళ్తారు.