‘జంప్ జిలానీలు’తో జగన్ భేటీ, కార్యకర్తల అభీష్టమన్న నేతలు, నిర్ఘాంతపోయిన జగన్!?
పలువురు వైసీపీ నేతలు తెలుగుదేశంలోకి జంప్ చేయబోతున్నారంటూ వినిపిస్తున్న వార్తలపై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్రమత్తమయ్యారు. ఆయా నేతలతో భేటీ అయి చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
అమరావతి: పలువురు వైసీపీ నేతలు తెలుగుదేశంలోకి జంప్ చేయబోతున్నారంటూ వినిపిస్తున్న వార్తలపై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్రమత్తమయ్యారు. ఆయా నేతలతో భేటీ అయి చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, అనంతపురం మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డితోపాటు మరికొందరు వైసీపీ నేతలు త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం జరిగింది.
కర్నూలు జిల్లాకు చెందిన ఒక ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలతో సమావేశమైన జగన్ వారు చెప్పింది విని నిర్ఘాంతపోయినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో చేరాలంటూ కార్యకర్తలు తమపై ఒత్తిడి తీసుకొస్తున్నారని వారు జగన్ కు చెప్పినట్లు సమాచారం.
అంతేకాదు, కార్యకర్తల అభీష్టం మేరకే తాము నడుచుకుంటామని జగన్ ఎదుట వారు కుండబద్దలు కొట్టినట్లు తెలిసింది. మరోవైపు తాను తెలుగుదేశం పార్టీలో చేరనని, వైసీపీలోనే కొనసాగుతానని ఎంపీ రేణుక ఇప్పటికే స్పష్టం చేశారు.
అయినా 'ఏ నిమిషానికి ఏమి జరుగునో.. ఎవరూహించెదరు..' అన్నట్లు రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరు చెప్పగలరు. పార్టీలు మారడం నాయకుల జన్మహక్కు అని సరిపెట్టుకోవలసిందే మరి!