బాబు అబద్దాలకు ఇక క్లైమాక్స్, ఆ దీక్ష చూసుంటే ఉత్తమ్ విలన్ ఆయనకే ఇచ్చేవాళ్లేమో: జగన్
ఏలూరు: రాజ్యాంగానికి తూట్లుపొడుస్తూ మీడియాను మేనేజ్ చేస్తూ నాలుగేళ్లుగా పాలనసాగిస్తున్న చంద్రబాబు.. ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ప్రజలను దారుణంగా వంచించారని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్నందునా.. మీలో ఏ ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా? అని జగన్ ప్రజలను ఉద్దేశించి ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 161వ రోజు ఆయన ఏలూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
గుడి భూముల నుంచి గుడిలో లింగం దాకా..:
'రాష్ట్రానికి ఎంతో చేస్తారని పశ్చిమగోదావరి ప్రజలు టీడీపీని నమ్మారు. అందుకే 15కి 15స్థానాల్లో ఆ పార్టీని గెలిపించారు. కానీ చంద్రబాబు మాత్రం జనం గుండెల్లో గునపాలు దింపారు. నాలుగేళ్లుగా ఇసుక నుంచి బొగ్గు దాకా, గుడి భూముల నుంచి గుడిలో లింగం దాకా అన్నింటిని మింగేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలకు ఈ జిల్లా నుంచే టీడీపీ బీజం వేసింది. ఇసుక అక్రమాలను ఇసుక అక్రమాలను అడ్డుకున్న తహశీల్దార్ వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడిచేశాడు. ఈ జిల్లా నుంచే దాదాపు 400 కోట్ల రూపాయల విలువైన ఇసుకను అక్రమంగా తవ్వేసుకున్నారు.' అని జగన్ ఆరోపించారు.
15కి 15 గెలిపిస్తే.. ఇలా రుణం తీర్చుకున్నారు.:
యథా చంద్రబాబు.. తథా టీడీపీ ఎమ్మెల్యేలు అన్నట్టుగా రాష్ట్రంలో పరిస్థితి ఉందని జగన్ ఎద్దేవా చేశారు. చింతమనేనితోపాటు మరో ఎమ్మెల్యే శేషారావు గోదావరి గుండెల్ని పిండుతూ ఇసుక మాఫియాకు తెరదీశారని అన్నారు. ఎమ్మార్వో వనజాక్షిపై దాడి జరిగితే ముఖ్యమంత్రే పంచాయితీ చేశారని అన్నారు.
'ఒక్క ఎమ్మార్వోనేకాదు ఫారెస్ట్ ఆఫీసర్లు, అంగన్వాడీ అక్కచెల్లెమ్మలను కూడా తిట్టి, కొట్టారు. చివరికి అడిషనల్ జిల్లా జడ్జిగారిపైనా దౌర్జన్యం చేశారు. అందుకుగానూ ఇక్కడి ఎమ్మెల్యేలకు సీఎం రేటింగ్స్లో మంచి మార్కులు ఇచ్చారు.' అని జగన్ విమర్శించారు. 15కి 15స్థానాల్లో గెలిపించినందుకు చంద్రబాబు ఇలా రుణం తీర్చుకున్నారని ఎద్దేవా చేశారు.
మోసపోనివాళ్లే లేరు:
'ఎన్నికల సమయంలో రైతుల రుణాలు మాఫీ అన్నారు. డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలు మాఫీ చేస్తామన్నారు. ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. కానీ ఏ ఒక్క హామిని చంద్రబాబు నెరవేర్చలేదు. అవేవి నెరవేర్చకపోగా రేషన్ కార్డులనే ఎత్తేసే పరిస్థితి. పెట్రోల్, డీజిల్పై విపరీతంగా పన్నులు. కరెంట్ చార్జీలు, ఆర్టీసీ టికెట్ల ధరలు అదుపులేకుండా పోతున్నాయి. బాబు చేతిలో మోసపోనివారంటూ ఎవరూలేరు.' అని జగన్ ఆరోపించారు.
అబద్దాలకు క్లైమాక్స్:
పదేళ్లు కాదు 15ఏళ్లు ప్రత్యేక హోదా కావాలని ఎన్నికలకు ముందు మాట్లాడిన చంద్రబాబుకు.. ఆ తర్వాత ఆ విషయం గుర్తుకురాలేదన్నారు జగన్. నాలుగేళ్ల పాటు బీజేపీతో కాపురం చేసి.. ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. హోదా విషయంలో చంద్రబాబు అబద్ధాలు క్లైమాక్స్కు చేరాయన్నారు.
రూ.30 కోట్లు ఖర్చుపెట్టి ఒక్కపూట నిరాహార దీక్ష చేశాడని, బాబాలా ఆయన వేదికపై కూర్చుంటే అందరూ వెళ్లి కాళ్లు మొక్కాలట అని ఎద్దేవా చేశారు. పద్మభూషణ్, ఆస్కార్ అవార్డులు ఇచ్చేవాళ్లు గనుక చంద్రబాబును చూసుంటే ఆయనకే ఉత్తమ విలన్ అవార్డు ఇచ్చేవారన్నారు.