మరో సంక్షేమ పథకానికి శ్రీకారం: రేపటినుంచే వైఎస్సార్ వాహనమిత్ర: భారీగా దరఖాస్తులు
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా..సొంత వాహనం కలిగిన ప్రతి ఆటో, క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లకు ఏటా 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో శుక్రవారం ఈ కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ పథకానికి వైఎస్సార్ వాహనమిత్ర అని పేరు పెట్టారు. రాష్ట్రంలో అర్హులైన ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లకు ఏటేటా 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తామని వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
గత ప్రభుత్వానికీ ఇప్పటికీ తేడా కనిపించాల్సిందే: 60 రోజులే మీకు సమయం : సీఎం జగన్
జిల్లాలవారీగా..మంత్రుల చేతుల మీదుగా
వైఎస్సార్ వాహనమిత్ర పథకానికి అవసరమైన విధి విధానాలు, మార్గదర్శకాలను ప్రభుత్వం ఇదివరకే విడుదల చేసింది. అర్హులైన లబ్దిదారులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే వీలు కల్పించింది. ఆన్ లైన్ ద్వారా 1,75,809 దరఖాస్తులు అందినట్లు రవాణాశాఖ అధికారులు వెల్లడించారు. దరఖాస్తుదారులందరికీ ఆర్థిక సహాయాన్ని అందించేబోతోంది ప్రభుత్వం. పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రారంభిస్తుండగా.. జిల్లాల్లో ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు లబ్దిదారులకు 10 వేల రూపాయల మొత్తంతో కూడిన చెక్కును అందజేస్తారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు రవాణాశాఖ పేర్కొంది.
సొంతం వాహనం.. సొంతంగా డ్రైవింగ్
సొంతంగా ఆటో, ట్యాక్సీ, క్యాబ్ వాహనాలు ఉండి, వాటిని తామే నడుపుకొంటూ జీవనాన్ని కొనసాగిస్తున్న డ్రైవర్లను మాత్రమే ఈ పథకానికి అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. అలాంటి వారికే ఏటేటా 10 వేల రూపాయల ఆర్థిక ప్రోత్సాహాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. డ్రైవర్లకు వేలిడిటీ ఉన్న లైసెన్స్ ఉండి తీరాలి. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, వాహన పన్ను చెల్లింపులు అన్నీ పక్కాగా ఉంటేనే అర్హులుగా పరిగణిస్తారు. ఒక కుటుంబంలో ఎన్ని ఆటోలు గానీ ట్యాక్సీలు గానీ ఉన్నప్పటికీ.. ఒక వాహనానికి మాత్రమే ఆర్థిక ప్రోత్సాహం అందుతుంది. ప్రతి డ్రైవర్ కూడా ఆధార్ కార్డు, తెల్లరేషన్ కార్డును పొంది ఉండాలంటూ ప్రభుత్వం నిబంధనలు విధించింది.
ఆధార్ కార్డు తప్పనిసరి..
ప్రతి డ్రైవర్ కూడా తన లైసెన్స్ ను ఆధార్ కార్డుతో అనుసంధానించడం తప్పనిసరి చేశారు. ఆధార్ కార్డుతో అనుసంధానించడానికి ఉప రవాణాశాఖ అధికారి, ప్రాంతీయ రవాణాశాఖ అధికారి, మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఆయా డ్రైవర్ల లైసెన్స్ కార్డు, ఆధార్ కార్డు వివరాలు రవాణా శాఖకు సంబంధించిన అధికారిక వెబ్ సైట్ డేటాబేస్ తో పోల్చి చూస్తారు. సరైనదిగా తేలినప్పుడే డ్రైవర్లను అర్హులుగా గుర్తిస్తారు. 10 వేల రూపాయల నగదును ప్రభుత్వం నేరుగా డ్రైవర్ల చేతికి అందించదు. దీనికి అవసరమైన బ్యాంకు ఖాతాను డ్రైవర్లు ఓపెన్ చేయాల్సి ఉంటుంది.