షాకివ్వనున్న జగన్, కెసిఆర్ కూడా: రోజాని బాబు టార్గెట్ చేశారా?
హైదరాబాద్: రోజా పైన ఏడాది సస్పెన్షన్, హైకోర్టు ఉత్తర్వులు, సభలోకి ప్రభుత్వం అనుమతించకపోవడం నేపథ్యంలో.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు లోటస్ పాండులో భేటీ అయ్యారు. చంద్రబాబు ప్రభుత్వంపై కోర్టు ధిక్కారణ కేసు పెట్టాలని జగన్ యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.
సోమవారం హైకోర్టుకు మరో ఫిర్యాదు అందనుంది. రోజాపై సస్పెన్షన్ను ఎత్తివేస్తూ కోర్టు ఇచ్చిన ఆదేశాలను అసెంబ్లీ స్పీకర్తో పాటు చంద్రబాబు సర్కారు అమలు చేయలేదని జగన్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు సర్కారుపై కోర్టు ధిక్కరణ కింద పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.
సభాపతి కోడెల శివప్రసాద రావు పైన గవర్నర్కు ఫిర్యాదు చేసిన అనంతరం లోటస్ పాండ్లోని పార్టీ కార్యాలయానికి చేరుకున్న జగన్ పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ నిర్వహించారు. ఇందులో ధిక్కారణ పిటిషన్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే, దీనిపై పూర్తిగా తెలియాల్సి ఉంది.
నల్లని దుస్తులతో నిరసన
రోజాను అడ్డుకుంటున్నందుకు నిరసనగా రేపు (శనివారం) అసెంబ్లీకి నల్లటి దుస్తులు ధరించి రావాలని వైసిపి నిర్ణయించింది. సభా కార్యక్రమాలు అడ్డుకోవాలని భావిస్తున్నారు.
నిరాధార ఆరోపణలు: బోండ ఉమ
ప్రభుత్వం పైన నిరాధార ఆరోపణలు చేస్తున్నారని వైసిపి సభ్యుల పైన బోండ ఉమ మండిపడ్డారు. సభ్యుల హక్కులకు భంగం కలిగిస్తే ఎవరి పైన అయినా చర్యలు తప్పవన్నారు. ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.
రోజాను టార్గెట్ చేశారా?
రోజాను అధికార తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేసిందా అంటే అవుననే అంటున్నారు వైసిపి నేతలు. ప్రభుత్వాన్ని నిలదీస్తున్న తమ మహిళా ఎమ్మెల్యే రోజాను టిడిపి లక్ష్యంగా పెట్టుకుందని వైసిపి ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఇదే విషయాన్ని రోజా కూడా తాజాగా చెప్పారు.
గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాను ప్రజా సమస్యల పైన వైయస్ రాజశేఖర రెడ్డిని నిలదీశానని, కానీ ఆయన ఎప్పుడూ తనను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోలేదని రోజా శుక్రవారం చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూడా తనపై వ్యక్తిగత ఆరోపణలు చేయలేదన్నారు. కానీ చంద్రబాబు మాత్రం రోజా గొంతు కోసేస్తామనే విధంగా ప్రవర్తిస్తున్నారన్నారు.