రామోజీరావుతో భేటీ: జగన్ చిక్కుల్లో పడ్డారా?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈనాడు దినపత్రిక అధినేత రామోజీ రావును కలుసుకోవడం రాజకీయాల్లో దుమారమే రేపుతోంది. ఈ భేటీ వల్ల వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా సమస్యను ఎదుర్కుంటున్నట్లు భావిస్తున్నారు. తన నిరాహార దీక్షకు ప్రభుత్వం అనుమతి నిరాకరించిన నేపథ్యంలో రామోజీ రావును ఆయన కలుసుకోవడం కూడా దానికి మరో కారణమని చెబుతున్నారు.
రామోజీ రావుకు బద్ధ శత్రువుగా వ్యవహరిస్తూ వచ్చిన జగన్ ఒక్కసారిగా రామోజీ రావును కలుసుకోవడం వల్ల రాజకీయంగా కొంత నష్టం జరిగిందని అంటున్నారు. ఈ భేటీకి జగన్ సమాధాన చెప్పుకోవాల్సిన స్థితిలో పడ్డారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఈ భేటీని సమర్తించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈనాడు మీడియా అధిపతి రామోజీ రావును తమ నాయకుడు జన్మోహన్ రెడ్డి కలవడంలో తప్పేంటని తమ్మినేని సీతారాం అన్నారు. వచ్చే రోజుల్లో టీవీ 9 రవిప్రకాష్ను కూడా కలుస్తామని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
రామోజీ రావు పెద్దాయన, ఓ మీడియాకు అధిపతి అని అంటూ జగన్మోహన్ రెడ్డి ఆయనను కలవడంలో తప్పేమిటని సీతారాం ఎదురు ప్రశ్న వేశారు. రామోజీరావు చంద్రబాబుకు మాత్రమే పరిమితమా తమక్కూడా ఆయనంటే అభిమానం, గౌరవం ఉందన్నారు. మీడియా అధిపతులను రాజకీయ నాయకులు కలవడం అనేది కొత్తేమి కాదని, రాబోవు రోజుల్లో టీవీ 9 రవిప్రకాష్ను కూడా కలుస్తామని అన్నారు. వేరు ఆలోచనలు చేయాల్సిన పని లేదని అన్నారు.
రామోజీరావుతో జగన్ భేటీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మరో నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కూడా సమర్థించుకున్నారు. రామోజీ రావు సలహాను జగన్ కోరారని ఆయన చెప్పారు. రామోజీ రావును కలుసుకుంటే తప్పేమిటని అడిగారు. అయితే, మొత్తంగా రామోజీరావు, జగన్ భేటీ రహస్యమేమిటనే విషయంపై మాత్రం ఉత్కంఠ వీడడం లేదు.