మా జాతికి నీ అవసరంలేదు, నువ్వలా చేస్తే రిజర్వేషన్లు వదిలేస్తాం: జగన్పై ముద్రగడ ఫైర్
Recommended Video
తుని: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆదివారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాపు రిజర్వేషన్లపై జగన్ యూటర్న్ తీసుకోవడం బాధాకరమన్నారు. కాపు ఉద్యమం పుట్టిన గడ్డ పైనే ఆయన కాపులను అవమానించారని మండిపడ్డారు. జగన్ వల్ల కాపు రాజకీయ నేతల జీవితాలు నాశనం అవుతున్నాయని మండిపడ్డారు.
రెట్టింపు నిధులు ఇస్తామంటూ సవతి తల్లి ప్రేమ చూపవద్దన్నారు. తుని ఘటన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మరీ కాపులకు రిజర్వేషన్లపై జగన్ మద్దతు తెలిపారని గుర్తు చేశారు. కాపు రిజర్వేషన్లకు అసెంబ్లీలోను మద్దతు పలికారని చెప్పారు. ఇప్పుడు రాష్ట్ర పరిధిలోని అంశం కాదని చెప్పడం బాధాకరమన్నారు.
కాపులు ఎప్పుడూ మీ మోచేతి నీళ్లు తాగుతూ మీ పల్లకీ మోయాలా అని దుమ్మెత్తిపోశారు. తమ జాతిపై (కాపు) జగన్కు చిన్న చూపు ఎందుకని నిలదీశారు. పాదయాత్రలో మీరు ఇస్తున్న హామీలకు రాష్ట్ర, కేంద్ర బడ్జెట్కు సరిపోతాయా అని నిలదీశారు. మా రిజర్వేషన్లపై మీకు సంబంధం లేకుంటే కేంద్ర పరిధిలోని విషయాలపై మీరు ఉద్యమాలు ఎందుకు చేస్తున్నారని నిలదీశారు.
'అందుకే కాపు రిజర్వేషన్లపై అలా': జగన్ ప్లాన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్!
మా హామీలపై యూటర్న్ తీసుకున్న జగన్కు మా జాతి ఓట్లు అడిగే హక్కు లేదని ముద్రగడ అన్నారు. మా కాపు జాతికి మీ టిక్కెట్లు అవసరం లేదని దుమ్మెత్తి పోశారు. మా జాతి రిజర్వేషన్లపై వ్యతిరేకతా లేక రిజర్వేషన్ల పైన మీరు వ్యతిరేకమా చెప్పాలన్నారు. మా కుటుంబంపై జగన్ దొం గ ప్రేమ, మొసలి కన్నీరు కార్చారని దుయ్యబట్టారు.
మా జాతికి రిజర్వేషన్ ఇచ్చే వాళ్ల పల్లకీనే మేం మోస్తామని చెప్పారు. జగన్ సీఎం పదవీ ఆకాంక్షను వదిలేస్తే మేం కూడా మా జాతీకి రిజర్వేషన్ల కాంక్షను వదిలేస్తామని సవాల్ చేశారు. కాపు జాతి ఎక్కడి నుంచో రాలేదని, ఏపీలోనే పుట్టిందని చెప్పారు.