కెసిఆర్తో రగడ: 'జగన్ విభజనకు ముందే చెప్పినా పట్టించుకోని బాబు'
అనంతపురం: రాష్ట్ర విభజనకు ముందే జల వివాదాలు వస్తాయని తమ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారని, అయినా దానిని ఎవరూ పట్టించుకోలేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అనంత వెంకట్రామి రెడ్డి గురువారం అన్నారు.
తెలంగాణలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కడుతున్న పాలమూరు - రంగారెడ్డి తదితర ప్రాజెక్టుల పైన ఏపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. తెలుగుదేశం, వైసిపి సహా ఏపీలోని పార్టీలు ప్రాజెక్టుల పైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణలోని ఈ ప్రాజెక్టుల వల్ల తమకు నీళ్లు రావంటున్నారు.
ఈ నేపథ్యంలో జగన్ దీక్షకు కూడా సిద్ధమయ్యారు. తెలంగాణ కడుతున్న ప్రాజెక్టుల పైన జగన్ మరో రెండు మూడు రోజుల్లో దీక్ష చేయనున్నారు. ఈ నేపథ్యంలో అనంత వెంకట్రామి రెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్పందించారు.
అనంత మాట్లాడుతూ... విభజనకు ముందే జగన్ జల వివాదాలపై హెచ్చరించినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. గోదావరి, కృష్ణా జలాల పైన ఏపీ ఆధారపడి ఉందని చెప్పారు. రాజకీయాల కోసం చంద్రబాబు రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని దుయ్యబట్టారు.
ఓ వైపు తెలంగాణ సర్కార్ అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నా చంద్రబాబు ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదన్నారు. తెలంగాణ ప్రాజెక్టుల పైన ఈ నెల 16, 17, 18వ తేదీల్లో జగన్ కర్నూలు కేంద్రంగా దీక్ష చేపడతారని చెప్పారు.
ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాజెక్టుల పైన చంద్రబాబు పెదవి విప్పకపోవడం దారుణం అన్నారు. ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టులు కడుతుంటే చంద్రబాబు మౌనంగా ఉండటే ఏపీకి శాపంగా మారిందని విమర్శించారు.
ఏపీ భవిష్యత్తులో ఎడారిగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మన హక్కులను మనమే కాపాడువాలనే ఉద్దేశ్యంతో జగన్ జల దీక్ష చేస్తున్నారన్నారు. నీటి కోసం అనర్థాలు తలెత్తే అవకాశముందన్నారు. జగన్ జలదీక్ష ఓ ప్రాంతం, పార్టీ సమస్య కాదని ఇది ప్రజలందరి సమస్య అన్నారు. జగన్ జలదీక్షను ప్రజలంతా విజయవంతం చేయాలన్నారు. 17న రాష్ట్రంలోన్ని అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు ఉంటాయన్నారు.