వైఎస్ జగన్: నవంబర్ 6 నుండి పాదయాత్ర, 2 రోజుల ముందే తిరుపతికి
వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పాదయాత్ర తేదిల్లో మార్పులు చోటు చేసుకొనే అవకాశం ఉన్నట్టు వైసీపీ వర్గాల్లో ప్రచారం ,సాగుతోంది.
అమరావతి: వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పాదయాత్ర తేదిల్లో మార్పులు చోటు చేసుకొనే అవకాశం ఉన్నట్టు వైసీపీ వర్గాల్లో ప్రచారం ,సాగుతోంది. ముందుగా ప్రకటించినట్టుగా నవంబర్ 2వ, తేది నుండి కాకుండా నవంబర్ 6వ, తేది నుండి వైఎస్ జగన్ పాదయాత్రను ప్రారంభించే అవకాశాలు కన్పిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పాదయాత్ర చేయాలని తలపెట్టాడు. అయితే తొలుత అక్టోబర్ మాసంలోనే పాదయాత్రను చేయాలని నిర్ణయించారు.
అయితే కొన్ని కారణాలతో పాదయాత్రను అక్టోబర్ నుండి నవంబర్ రెండవ తేదికి మార్చారు. అయితే పాదయాత్ర చేయాలని నిర్ణయించుకొన్న మీదట ప్రతి శుక్రవారం సిబిఐ కోర్టుకు హజరు కావడంపై మినహయింపు ఇవ్వాలని సిబిఐ కోర్టును వైఎస్ జగన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది.
ప్రతి శుక్రవారం నాడు కోర్టుకు హజరుకాకుండా మినహయింపు లభిస్తోందని భావించిన వైసీపీ శ్రేణులకు నిరాశే ఎదురైంది.దరిమిలా పాదయాత్ర షెడ్యూల్లో స్వల్పమార్పులు చేశారని సమాచారం.
వైఎస్ జగన్ పాదయాత్ర షెడ్యూల్లో మార్పు
వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పాదయాత్రకు అడుగడుగునా ఆటంకాలే ఎదురౌతున్నాయి. నవంబర్ 2 నుంచి పాదయాత్రను తలపెట్టిన జగన్ దాన్ని మరోసారి వాయిదా వేశారు. నవంబర్ 3 శుక్రవారం . ఆ రోజు కోర్టు విచారణకు జగన్ హాజరు కావాల్సి వుంది.పాదయాత్ర ప్రారంభించిన మరునాడే యాత్రను ఆపి కోర్టుకు హజరుకావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పాదయాత్ర షెడ్యూల్ను మార్చినట్టు చెబుతున్నారు. నవంబర్ 6వ తేదీ నుంచి పాదయాత్రను ప్రారంభించాలని ఆయన నిర్ణయించుకున్నారని సమాచారం.
పాదయాత్రకు ముందే తిరుపతికి జగన్
పాదయాత్ర ప్రారంభించేందుకు రెండు రోజుల ముందే వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ తిరుపతి వెళ్ళాలని నిర్ణయించుకొన్నారు. తిరుమలకు వెళ్లి శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకొంటారు.పాదయాత్ర విజయవంతంగా పూర్తి కావాలని స్వామివారిని జగన్ మొక్కుకొంటారు.తిరుపతి నుండి నేరుగా కడపకు చేరుకొంటారు. కడప దర్గా, చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసి అనంతరం పాదయాత్రను చేపట్టనున్నారని వైసీపీ వర్గాలు తెలిపాయి.
నవంబర్ 10న, కోర్టు విచారణకు జగన్
కోర్టు కేసు విచారణ కారణంగానే పాదయాత్ర షెడ్యూల్లో వైసీపీ చీఫ్ జగన్ మార్పులు చేర్పులు చేశారని సమాచారం. కనీసం మూడు రోజుల పాటు ఆగకుండా పాదయాత్ర చేయాలని భావించారని సమాచారం. నవంబర్ ఆరవ తేదీ నుంచి 9 వరకు యాత్ర నిర్వహించనున్నారు. అటు తర్వాత నవంబర్ 10న కోర్టు విచారణకు హజరుకానున్నారని సమాచారం.
హైకోర్టును ఆశ్రయించనున్న వైసీపీ
సిబిఐ కోర్టుకు ప్రతి శుక్రవారం నాడు వ్యక్తిగతంగా హజరుకావాలనే నిబంధనపై మినహయింపు ఇవ్వాలనే విషయమై సిబిఐ కోర్టు జగన్ పిటిషన్ను తోసిపుచ్చింది. దీంతో వైఎస్ జగన్ ఈ విషయమై హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని సమాచారం.హైకోర్టు ద్వారా ప్రతి శుక్రవారం నాడు కోర్టుకు హజరుకాకుండా మినహయింపు ఇవ్వాలని కోరే అవకాశం ఉంది.