చంద్రబాబూ! నువ్వేమైనా సుందరయ్యవా? గౌతు లచ్చన్నవా? అప్పుడు నీ ఆస్తి ఎంత?..ఇప్పుడు ఎంత?
Recommended Video
హైదరాబాద్: చంద్రబాబును నేను ఒక్కటే సూటిగా అడుగుతున్నా? నాలుగున్నరేళ్లలో చంద్రబాబు మట్టి, ఇసుక, భూమి దోచుకున్నాడు. భూస్వామి అయిపోయాడు. అందుకే ఈ ఆవేదన. కాలం ఎల్లవేళలా ఒకటి కాదు. ఒక్కరి వైపే ఉండదు. నువ్వేమైనా పుచ్చలపల్లి సుందరయ్యవా? గౌతు లచ్చన్నవా? జయప్రకాశ్ నారాయణ్ లాంటి నేతవా?.. అని మోహన్ బాబు సుతిమెత్తగా చురకలు అంటించారు. రాజకీయాల్లో చేరే ముందు చంద్రబాబు ఆస్తి ఎంత? ఇప్పుడు ఎంత? అని ప్రశ్నించారు. ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయని నిలదీశారు. దీనిపై ఆరా తీయాలని సూచించారు. 1975లో చంద్రబాబు రాజకీయాల్లోకి చేరడానికి ముందు ఆయన ఆస్తి ఎంతో తనకు తెలుసని మోహన్ బాబు అన్నారు. చంద్రబాబు రాజకీయ జీవితం ప్రారంభించే సమయంలో ఆయన వద్ద డబ్బు లేదని అన్నారు. ఆరా తీయాంటే 1975 నాటి ఫైళ్లు ఆదాయపు పన్ను శాఖ కార్యాలయంలో దొరుకుతాయని అన్నారు.
కాబోయే సీఎం.. జగన్: స్వీప్ చేయబోతున్నారు, ఎన్టీఆర్ విషయంలో ఇదే చెప్పా, రాసిపెట్టుకోండి: మోహన్ బాబు
చంద్రబాబు మాయమాటలు నమ్మి ఎన్టీఆర్ కు ఎదురు తిరిగాను..
సినిమాల్లో గానీ, నిజ జీవితంలో గానీ తనకు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు దేవుడితో సమానం అని మోహన్ బాబు అన్నారు. చంద్రబాబు నాయుడు చెప్పిన మాయ మాటలను విశ్వసించి, తాను ఎన్టీ రామారావుకు ఎదురు తిరిగానని అన్నారు. ఎన్టీ రామారావు కన్నుమూసిన రోజే, తాను పశ్చాత్తాపాన్ని ప్రకటించానని గుర్తు చేశారు. తెలిసో, తెలియకో, తప్పు చేశానని తాను 20 ఏళ్ల కిందటే బహిరంగంగా క్షమాపణ కోరానని చెప్పారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చానని అన్నారు.
ఎన్టీఆర్ సభ్యత్వం లేకుండా చేసిన ఘనత చంద్రబాబుది..
తెలుగుదేశం స్థాపించిన అనంతరం ఎన్టీ రామారావు అనేక కష్ట, నష్టాలకు ఓర్చుకున్నారని మోహన్ బాబు అన్నారు. అప్పుడు తాను ఆయన వెంటే ఉన్నానని చెప్పారు. తిండి తినక, సరిగ్గా నిద్రపోక, రాత్రనకా, పగలనకా ఎన్టీ రామారావు కష్టపడి తొమ్మిది నెలల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని చెప్పారు. అలాంటి మహా నాయకుడి పేరును తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నుంచి తొలగించిన ఘనత తన ఆప్తమిత్రుడు చంద్రబాబుదేనని మోహన్ బాబు ఎద్దేవా చేశారు. టీడీపీలో చేరాలని చంద్రబాబు తనను చాలాసార్లు ఆహ్వానించారని చెప్పారు. ఎన్టీ రామారావు లేని పార్టీలో తాను ఉండనని ఇదివరకే స్పష్టం చేశానని అన్నారు.
అమరావతికి వచ్చి, చేతులు కట్టుకుని నిల్చుంటా..
ప్రభుత్వం నుంచి తనకు 19 కోట్ల రూపాయలకు పైగా మొత్తం ఫీజు రీ ఎంబర్స్ మెంట్ ద్వారా ప్రభుత్వం నుంచి అందాల్సి ఉందని మోహన్ బాబు అన్నారు. ఈ మొత్తాన్ని విడుదల చేయాలని, అవసరమైతే తాను అమరావతికి వచ్చి, చేతులు కట్టుకుని నిల్చుంటానని చంద్రబాబుకు ఫోన్ లో కోరానని చెప్పారు. దీనిపై చంద్రబాబు నుంచి స్పందన రాలేదని చెప్పారు. అనేక సార్లు ఉత్తరాలు రాశానని, ఓ సారి స్వయంగా మనోజ్ ను సచివాలయానికి పంపించానని అన్నారు. తాను పలుమార్లు కోరగా.. మూడు విడతల్లో బకాయిలను విడుదల చేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్ సమాచారం ఇచ్చారని అన్నారు. ఆ మొత్తం కూడా రాలేదని అన్నారు.
టీడీపీకి మద్దతు ఇస్తేనే..
కొందరు విద్యాసంస్థల ఛైర్మన్లు తెలుగుదేశంతో చేతులు కలిపి, విద్యాభివృద్ధి పేరుతో 10 నుంచి 50 ఎకరాల వరకు భూములను కేటాయించుకున్నారని చెప్పారు. అలాంటి విద్యాసంస్థలకు మాత్రమే ఫీజు రీఎంబర్స్ మెంట్ విడుదలైందని అన్నారు. తనతో పాటు చాలా కళాశాలలకు ఫీజు బకాయిలను ప్రభుత్వం విడుదల చేయలేదని అన్నారు. చంద్రబాబు చుట్టూ వందిమాగధులు ఉన్నారని, తెలిసిన వాళ్లు, తెలియని వాళ్లు, అతి తెలివి ఉన్న వాళ్లు, ముఖ్యమంత్రికి కాకా పట్టాలనకున్న వాళ్లు చంద్రబాబు చుట్టూ చేరారని మోహన్ బాబు విమర్శించారు. బ్యాంకుల్లో తన పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి డబ్బులు కట్టాల్సిన వస్తోందని, విద్యాసంస్థను నడిపించడానికి ఆస్తులు అమ్ముకునే పరిస్థితిని ప్రభుత్వం కల్పించిందని అన్నారు.