2019లో జగనే సీఎం.., అప్పటినుంచి సత్సంబంధం, వైఎస్ తో చివరిదాకా స్నేహం: సూపర్ స్టార్ కృష్ణ
Recommended Video
హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ గురువారం తన 76వ జన్మదినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సాక్షి మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన రాజకీయాలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ పాదయాత్రను అభినందించడమే కాదు.. వచ్చే ఎన్నికల్లో ఆయనే సీఎం కాబోతున్నారంటూ జోస్యం చెప్పారు. దివంగత సీఎం వైఎస్, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిలతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
వైఎస్ తో అనుబంధం:
తాను ఎంపీగా ఉన్న సమయంలో వైఎస్ కూడా ఎంపీగా ఉన్నారని కృష్ణ గుర్తుచేసుకున్నారు. వైఎస్ ను కలిసేందుకు వారింటికి వెళ్లేవాడినని, అప్పటినుంచే జగన్ తో సత్సంబంధాలు మొదలయ్యాయని తెలిపారు. ప్రజలకు ఏదో చేయాలన్న పట్టుదల, కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి జగన్ అని అభిప్రాయపడ్డారు.
2019లో జగనే సీఎం:
వైఎస్ పాదయాత్ర చేసిన సమయంలో ఇసుకేస్తే రాలనంత జనం వచ్చేవారని, ఇప్పుడు జగన్ పాదయాత్రకు కూడా అంతే స్పందన వస్తోందని కృష్ణ గుర్తుచేసుకున్నారు. ఇంత ఎండల్లో జగన్ పాదయాత్రను కొనసాగించడం గొప్ప విషయమేనని అన్నారు. 2019లో జగనే సీఎం అవుతారని ఆయన పేర్కొన్నారు.
వైఎస్ పై ప్రశంసలు:
ఇచ్చిన మాట మీద నిలబడి చేసిన వాగ్దానాలను అమలు చేసిన నాయకున్ని ఒక్క వైఎస్ ని మాత్రమే చూశానని కృష్ణ తెలిపారు. ఆయన మాట మీద నిలబడ్డ తీరు, ప్రజలకు చేసిన సేవ ఎనలేనివి అని కొనియాడారు. వైఎస్ ప్రవేశపెట్టిన అన్ని పథకాలు తనకు నచ్చాయని పేర్కొన్నారు. వైఎస్, తానూ చివరివరకు మంచి మిత్రులుగా కొనసాగామని గుర్తుచేసుకున్నారు.
వైఎస్ పథకాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి:
అప్పటి పాదయాత్రలో జనం వైఎస్ ని ఎలాగైతే రిసీవ్ చేసుకున్నారో.. ఇప్పుడు జగన్ ను కూడా అలాగే రిసీవ్ చేసుకుంటున్నారని కృష్ణ అన్నారు. పాదయాత్ర పొడవునా జనం ఆయన్ను ఆశీర్వదిస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రతీ ఒక్కటి జనానికి ఎంతగానో ఉపయోగపడిందని, అందుకే తనకు వైఎస్ ఇష్టమైన సీఎం అని స్పష్టం చేశారు.