చావోరేవో: జగన్ పాదయాత్ర, ప్లీనరీలో ప్రకటన?
2019 ఎన్నికల్లో చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి వైసీపీ అధినేత జగన్ కు నెలకొంది. అధికారంలో ఉన్న టిడిపిని గద్దె దించేందుకు జగన్ వ్యూహలను రచిస్తున్నారు.
అమరావతి: 2019 ఎన్నికల్లో చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి వైసీపీ అధినేత జగన్ కు నెలకొంది. అధికారంలో ఉన్న టిడిపిని గద్దె దించేందుకు జగన్ వ్యూహలను రచిస్తున్నారు.అయితే రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పాదయాత్రకు జగన్ సన్నద్దమౌతున్నారు. టిడిపి పాలనలో వైఫల్యాలను జగన్ ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసేందుకు పాదయాత్రను ఉపయోగించుకోనున్నారు. వైసీపీలో ప్లీనరీలో జగన్ ఈ అంశాన్ని ప్రకటించనున్నట్టు ప్రకటించే అవకాశాలున్నాయి.
2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ పావులు కదుపుతున్నారు. అధికార పార్టీలోని అసంతృప్త నాయకులను తమ పార్టీవైపు వచ్చేలా మంతనాలు జరుపుతున్నారు.
ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కుమార్ ను కూడ నియమించుకొన్నారు. బుదవారం నాడు పార్టీ సీనియర్ల సమావేశంలో ప్రశాంత్ కిషోర్ ను పార్టీ నాయకులకు ఆయన పరిచయం చేశారు.
అయితే పార్టీ ప్లీనరీ వేదికగా కొత్త నిర్ణయాలను వైఎస్ జగన్ ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఈ విషయమై పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడంతో పాటు అధికార పార్టీని చిక్కుల్లో పెట్టేలా ఆ పార్టీ వ్యూహలను రచిస్తోంది.
వైఎస్ జగన్ పాదయాత్ర
వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్ పాదయాత్ర నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలో పాదయాత్రను నిర్వహించనున్నారు. ఈ పాదయాత్ర ద్వారా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు ఉపయోగించుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. అంతేకాదు ఈ యాత్ర ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహన్ని కూడ నింపే అవకాశం ఉంటుందని కూడ ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. అయితే పాదయాత్ర ఎప్పటి నుండి నిర్వహిందనున్నారు. ఎక్కడి నుండి ఎక్కడి వరకు యాత్ర సాగుతోందనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఈ విషయమై ప్లీనరీలో జగన్ ప్రకటన చేసే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పాదయాత్ర తర్వాత అధికారంలోకి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ, అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడ పాదయాత్ర తర్వాతనే అధికారంలోకి వచ్చిన చరిత్ర ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నిర్వహించి 2004 లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు. అయితే ఆనాడు నెలకొన్న పరిస్థితులకుతోడు వైఎస్ఆర్ పాదయాత్ర కూడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడింది. మరోవైపు 2014 ఎన్నికలకు ముందు సుదీర్ఘకాలంపాటు చంద్రబాబునాయుడు పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్ర టిడిపిలో నూతనోత్తేజాన్ని నింపింది. రైతు రుణమాఫీని ప్రకటించడానికి పాదయాత్రే కారణమని చంద్రబాబునాయుడు పలుమార్లు ప్రకటించారు. ప్రజల సమస్యలను తెలుసుకొనేందుకు పాదయాత్ర ఓ వేదికగా మారిందనే అభిప్రాయం పార్టీ నేతల్లో ఉంది.
ప్రశాంత్ కిషోర్ సూచన మేరకే
ప్రశాంత్ కిషోర్ సూచన మేరకే జగన్ పాదయాత్ర చేయాలని సూచించారని పార్టీ వర్గాలంటున్నాయి. బుదవారం నాడు పార్టీ నాయకుల సమావేశంలో ప్రశాంత్ కిషోర్ ను నేతలకు ఆయన పరిచయం చేశాడు. రానున్న రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహలపై కూడ పార్టీ నాయకులు ఈ సమావేశంలో చర్చించారు. అంతేకాదు పాదయాత్ర చేయాలని ప్రశాంత్ కిషోర్ జగన్ కు సూచించడంతో ఆయన కూడ సానుకూలంగానే స్పందించినట్టు పార్టీవర్గాల్లో ప్రచారంలో ఉంది.
2019 ఎన్నికలే కీలకం
2019 ఎన్నికలు వైసీపీకి కీలకం. ఈ ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి రాకపోతే ఆ పార్టీ రాజకీయంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాల్సిన అనివార్య పరిస్థితులు ఆ పార్టీకి ఉన్నాయి. దీంతో అన్ని రకాల అవకాశాలను అందిపుచ్చుకోవడంతో పాటు, అన్ని అస్త్రాలను ప్రయోగించేందుకు కూడ ఆ పార్టీ సన్నద్దమైంది. అంతేకాదు టిడిపి వైఫల్యాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు పాదయాత్రను ఉపయోగించుకోనుంది.