'వచ్చే ఎన్నికల్లో జగన్కు 30 సీట్లు, పవన్ కళ్యాణ్కు సున్నా! అందుకే గెలవదు'
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్యే జలీల్ ఖాన్ శుక్రవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇటీవల గుంటూరులో జరిగిన నారా హమారా, టీడీపీ హమారా కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు గందరగోళం సృష్టించాలని చూశారని ఆరోపించారు.
ఆ గందరగోళానికి జగన్ క్షమాపణ చెప్పాలి
ఆ రోజు సభలో జరిగిన గందరగోళానికి వైయస్ జగన్మోహన్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. అధికారంలో లేనప్పుడే ఇంత దౌర్జన్యంగా ప్రవర్తిస్తే, జగన్ అధికారంలోకి వచ్చాక వైసీపీ ఎలా ఉంటుందో, రాష్ట్రం పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఆందోళన వ్యక్తం చేశారు.
వైసీపీకి 30 సీట్లు కూడా రావు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ముప్పై అసెంబ్లీ సీట్లకు మించి రావని జలీల్ ఖాన్ అన్నారు. జగన్ చేసేది ప్రజా సంకల్ప యాత్ర కాదని, అదో పిక్నిక్ యాత్ర అని ఎద్దేవా చేశారు. తండ్రి ఉన్నప్పుడు దోచుకున్న, అవినీతిపరుడైన జగన్కు అవినీతి గురించి మాట్లాడే అర్హత ఏమాత్రం లేదన్నారు.
ఆ అలవాటు జగన్కే కాదు, వారికీ ఉంది
వైయస్ జగన్ స్వార్థపరుడు అనే విషయం ప్రతి ముస్లిం వ్యక్తికి అర్థం అయిందని చెప్పారు. త్వరలోనే తాము అన్ని వర్గాలతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. గుంటూరు నారా హమారా, టీడీపీ హమారా సభలో వైసీపీ వారు గందరగోళం సృష్టించారని చెబుతూ.. ప్రత్యర్థి పార్టీల సభల్లో అల్లర్లు చేయడం జగన్ ఒక్కడికే కాదని, ఆయన తాత, తండ్రిలకు కూడా అలవాటేనని ఆరోపించారు.
పవన్ కళ్యాణ్కు ఒక్క సీటు రాదు
వచ్చే ప్రభుత్వంలో ముస్లిం అభ్యర్థికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరామని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీకి ఒక్క సీటు కూడా రాదని చెప్పారు. క్షేత్ర స్థాయిలో ఏమాత్రం బలం లేని జనసేన పార్టీ ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు.