'జగన్ పులివెందుల నుంచి పోటీ చేయరు, వైసీపీలో గుసగుస! వారం నుంచి కనిపించని విజయసాయి'
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి హైదరాబాద్ పైన ఉన్న ప్రేమ పులివెందులపై లేదని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆదివారం ఆరోపించారు. పులివెందులకు వెళ్లి ప్రభుత్వం ఇచ్చిన నీళ్లను చూస్తే జగన్కు జ్ఞానం వస్తుందన్నారు.
'మమతా బెనర్జీకే ప్రాణభయం లేదు, చంద్రబాబుకు భయమెందుకో చెప్పాలి'
కమలం నీళ్లు చల్లుకోవడానికి ఉన్న శ్రద్ధ, సమయం పులివెందుల ప్రజలు, నియోజకవర్గంపై లేదన్నారు. పులివెందులకు నీళ్లు ఇస్తే కనీసం ఆ నీళ్లు చూడటానికి కూడా వెళ్లకుంటే ఎలా అన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం వేరే జిల్లాల్లో సేఫ్టీ ప్లేస్ కోసం జగన్ వెతుకుతున్నారని పులివెందులకు చెందిన కొందరు చెప్పారని తెలిపారు. అమిత్ షా డైరెక్షన్లో జగన్ నడవడం కంటే వైసీపీ దుకాణం మూసుకోవడం బెట్టర్ అన్నారు.
జగన్కు అంత దౌర్భాగ్యం
కృష్ణా జలాలు పులివెందుల నియోజకవర్గానికి వెళ్లిన తర్వాత జగన్ బయటి జిల్లాల నుంచి పోటీ చేసే దౌర్భాగ్యం ఆయనకు వచ్చిందని దేవినేని ఎద్దేవా చేశారు. బయటి జిల్లాల్లో సీటు వెతుక్కునే పరిస్థితి పట్టిందన్నారు. 2019లో జగన్ పులివెందుల నుంచి పోటీ చేయరని వాళ్ల పార్టీ కార్యకర్తలో అంటున్నారని చెప్పారు.
వారం రోజులుగా కనిపించని విజయ సాయి రెడ్డి
తిరుపతి సభలో కేంద్రం తీరును ఎండగడతామని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి వారం రోజులుగా ఏపీలో కనిపించడం లేదన్నారు. కర్నాటకలో గాలి జనార్ధన్ రెడ్డి సోదరులను, అనుచరులను గెలిపించే పనిలో బిజీగా ఉన్నారని చెప్పారు. కర్నాటకలో బీజేపీకి ప్రచారం చేయడం అంటే తెలుగుజాతికి ద్రోహం చేయడమే అన్నారు.
అమిత్ షా డైరెక్షన్లో వైసీపీ
బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా డైరెక్షన్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తోందని దేవినేని అన్నారు. ఎవరు ఏ పార్టీలో చేరాలనేది ఢిల్లీ నుంచి అమిత్ షానే స్వయంగా నిర్ణయిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు లాలూచీతో ముందుకు సాగుతున్నాయని ఆరోపించారు.
బీజేపీ అధ్యక్ష పదవిని జగన్ తీసుకోవాలి
ఏపీలో ఖాళీగా ఉన్న బీజేపీ అధ్యక్ష పదవిని వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకోవాలని దేవినేని ఎద్దేవా చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందుల నుంచి పోటీ చేసే ఆలోచనలో లేరని చెప్పారు. వేరే జిల్లా నుంచి పోటీ చేస్తారని వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.