వైయస్ జగన్ పుష్కర స్నానం వాయిదా, 'యనమల మనుషుల బీభత్సం'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసిపి అధినేత వైయస్ జగన్ ఈ నెల 18వ తేదీన పుష్కర స్నానం చేయనున్నారు. తొలుత ఆయన రేపు (శనివారం) పుష్కర స్నానం చేయాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల కార్యక్రం వాయిదా పడింది.
అమలాపురంలో బాధిత దళితులను పరామర్శించిన జగన్
వైసిపి అధినేత జగన్ శుక్రవారం నాడు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆసుపత్రిలో దాడికి గురైన దళితులను పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల అమలాపురంలో దళితుల పైన దాడి జరిగింది.
ఈ నేపథ్యంలో ఆయన పరామర్శించారు. జగన్ మాట్లాడుత.. 21వ శతాబ్దంలోను సాటి మనిషి పైన దాడులు ఘోరమన్నారు. పదో తరగతి చదివే విద్యార్థిని కూడా చెట్టుకు కట్టేసి కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు చేస్తే కేసులు పెట్టాలి కానీ కొట్టడం ఏమిటని ప్రశ్నించారు.
పోలీసుల సమక్షంలోనే దళితులను చావబాదారన్నారు. తాము తప్పు చేయలేదని దళితులు చెప్పినా పోలీసులు వినిపించుకోలేదన్నారు. వాస్తవం తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం దారుణమన్నారు. హోంమంత్రి సొంత మండలంలోనే ఇలాంటి ఘటన బాధాకరమన్నారు.
చివరకు దళితులు ఆందోళన చేస్తేనే పోలీసులు స్పందించారన్నారు. బాధితులను ఆసుపత్రికి తరలించారన్నారు. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాకు వచ్చి కనీసం దళితులను పరామర్శించలేదని విమర్శించారు. పరామర్శిస్తే వారికి మనోధైర్యం వచ్చేదన్నారు.
ఎస్టీ, ఎస్సీ ప్రివెంట్ యాక్ట్ ప్రకారం ఇలాంటి తప్పులు జరిగినప్పుడు రూ.1 లక్ష నుంచి రూ.8.25 లక్షలు ఇవ్వాలని చెల్లించాలన్నారు. ప్రభుత్వం రూ.1 లక్ష ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. మొన్న సల్మన్ పేటలో మత్స్యకారుల పైన దాడి జరిగిందన్నారు.
ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడి మనుషులు బీభత్సం సృష్టించారన్నారు. నేను అక్కడకు వెళ్లి మత్స్యకారులను పరామర్శించానని, అదే స్ఫూర్తితో ఇప్పుడు దళితులను పరామర్శించానని చెప్పారు. తోటి వారిని మనిషిగా చూడకుంటే వ్యవస్థ మారదన్నారు. దళితులపై దాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలన్నారు. బాధితులకు ర.8.25 లక్షలు చెల్లించాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చడాలన్నారు.