ఆ అర్హత బాబుకు లేదు.. జగన్ సీఎం అవుతారని నా ప్రగాఢ నమ్మకం: కమెడియన్ పృథ్వీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్ జగన్ పాలన కోరుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో జనం ఆయనకే పట్టం కడుతారని ప్రముఖ సినీ హాస్య నటుడు, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ జోస్యం చెప్పారు. శుక్రవారం కొత్తపేటలోని తన మిత్రుడు, ప్రముఖ పండితుడు పెద్దింటి రామం ఇంటికి వచ్చిన సందర్భంగా పృథ్వీ మీడియాతో మాట్లాడారు.
బాబు పాలనలో ఆశలు అడియాసలు
'ప్రస్తుతం ప్రజల దృష్టి జగన్ వైపు మళ్లింది. నేను 2014 నుంచి వైసీపీ ప్రచార కార్యదర్శిగా పనిచేస్తున్నాను. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో విస్తృతంగా పర్యటించాను. గత ఎన్నికల్లో కొత్త రాష్ట్రం, చంద్రబాబుకు ఉన్న అనుభవం, రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానన్న ఆయన హామీ నమ్మి ప్రజలు ఓట్లేశారు. ప్రజలు మాకిచ్చిన ప్రతిపక్ష హోదాను సంతోషంగా స్వీకరించాం. అయితే నాలుగేళ్లుగా చంద్రబాబు పాలనను నిశితంగా గమనిస్తున్న ప్రజలు.. ఆయనపై పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలైనట్టు గ్రహించారు' అని పృథ్వీ అభిప్రాయపడ్డారు
జగన్ ను సీఎం.. అది నా ప్రగాఢ నమ్మకం
'ఇచ్చిన మాటకు కట్టుబడి, మడమతిప్పని, ప్రజా క్షేమం కోరుకున్న ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖరరెడ్డిల పాలన చూశాం. మళ్లీ వారి స్థానంలో ఆ తరహా పాలన అందించగల జగన్ను సీఎంగా చూస్తామన్నది నా ప్రగాఢ నమ్మకం.' అని పృథ్వీ అన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ఎండనకా, వాననకా, ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయక జగన్ ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్నారని పేర్కొన్నారు.
బాబుకు ఆ అర్హత లేదు
నీతి నిజాయితీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు పృథ్వీ. సంతలో పశువులను కొన్నట్టు అధికార పార్టీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందన్నారు. జగన్ మాత్రం..
ఎమ్మెల్సీ శిల్పామోహన్రెడ్డితో పదవికి రాజీనామా చేయించాకే ఆయన్ను పార్టీలోకి తీసుకున్నారని గుర్తుచేశారు. తద్వారా రాజకీయ విలువలకు అద్దం పట్టిన నాయకునిగా జగన్ గా నిలిచారని అన్నారు. ప్రజలు జగన్ నాయకత్వ ఆవశ్యకతను బలంగా కోరుకుంటున్నారని, అందుకే వచ్చే ఎన్నికల్లో ఆయనకు పట్టం కట్టబోతున్నారని చెప్పారు.
శ్రీరెడ్డి వివాదంపై:
ఇటీవల తలెత్తిన శ్రీరెడ్డి వివాదం అర్ధరహితం అని పృథ్వీ అన్నారు. శ్రీరెడ్డి వెనుక ఇంకెవరో ఉన్నారన్న అనుమానం కలుగుతోందన్నారు. ఏదేమైనా చిరంజీవి తల్లిని ఆమె విమర్శించడం బాధాకరం అన్నారు. చిరంజీవి కుటుంబంలో అందరూ కష్టపడి పైకొచ్చినవాళ్లే అని చెప్పారు. మహా మనిషి దాసరి నారాయణరావు ఉండి ఉంటే శ్రీరెడ్డి, కత్తి మహేష్ లాంటి వారు మాట్లాడేవారు కాదన్నారు.