జగన్కూ ట్రంప్ పరిస్థితి.. త్వరలో బంకర్లోకే... టీడీపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు..
ప్రజావ్యతిరేక విధానాలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ను చిన్నాభిన్నం చేశారని టీడీసీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాస్ విమర్శించారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తి రాష్ట్రాన్ని ఏలితే ఎంత నష్టం జరుగుతుందో చెప్పడానికి జగన్ ఏడాది పాలనే ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పారు. ఓవైపు ప్రభుత్వ తప్పిదాలను కోర్టులు తప్పు పడుతుంటే.. వాటిని కప్పి పుచ్చుకునేందుకు ప్రజల దృష్టి మరల్చేందుకు వైసీపీ నేతలు టీడీపీపై లేనిపోని నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో గురువారం(జూన్ 4) యరపతినేని మీడియాతో మాట్లాడారు.
జగన్ కూడా బంకర్లో.. : యరపతినేని వ్యాఖ్యలు..
ప్రజలు తిరగబడితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని.. జార్జ్ ఫ్లాయిడ్ హత్య నేపథ్యంలో అమెరికన్ పౌరుల నిరసనకు అధ్యక్షుడు ట్రంపే బంకర్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్లోనూ జగన్మోహన్ రెడ్డికి బంకర్లు ఏర్పాటు చేసుకుని తలదాచుకునే పరిస్థితి త్వరలోనే రాబోతోందని అన్నారు. చంద్రబాబు వయసు అయిపోయిందని విమర్శిస్తున్న వైసీపీ నేతలు.. ఆయనతో కలిసి తిరుమల కొండ ఎక్కాలని సవాల్ విసిరారు. వైసీపీ నేతలకు వయసు పెరగదా అని ప్రశ్నించారు.
ఊరుకునేది లేదని హెచ్చరిక..
చంద్రబాబు, లోకేష్లపై వైసీపీ నేతలు అనవసరంగా నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని యరపతినేని మండిపడ్డారు. టీడీపీకి భవిష్యత్ నేతలు చాలా మంది ఉన్నారని,వైసీపీ మాదిరి సూట్ కేసు కంపెనీలు పెట్టి అక్రమార్జన చేసుకోవడం నారా లోకేష్కు తెలియదని అన్నారు. తెలుగుదేశం భవిష్యత్తుకు ఏ ఢోకా లేదని.. ఎందరో నాయకులు ఉన్నారని చెప్పారు. జగన్ చుట్టూ ఉన్నవాళ్లంతా అవకాశవాదులు కాదా అని ప్రశ్నించారు.
Recommended Video
అంబటి వ్యాఖ్యలకు జగన్ కౌంటర్..
బుధవారం మీడియాతో మాట్లాడిన సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు వృద్ధాప్యం వచ్చేసింది ఆయన అవుట్ డేటెడ్ అయిపోయారని విమర్శించారు. లోకేష్ ఇంకా అప్డేట్ కాలేదని.. ప్రజల మధ్యకు వచ్చి భవిష్యత్ నాయకుడు అనిపించుకోలేకపోతున్నారని అన్నారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ,అభివృద్ది పథకాలు చూసి తిరిగి అధికారంలోకి వస్తామా రామా అని టీడీపీకి భయం పట్టుకుందన్నారు. అంబటి చేసిన ఈ విమర్శలను తాజాగా యరపతినేని తిప్పికొట్టారు.