మారదు, ఆలోచించి నిర్ణయం వాయిదా వేయండి, బాబుకు అలవాటే: మోడీకి జగన్ సుదీర్ఘ లేఖ
రూ.500, రూ.1000 నోట్ల రద్దు పైన ప్రధాని నరేంద్ర మోడీకి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు లేఖ రాశారు.
విజయవాడ: రూ.500, రూ.1000 నోట్ల రద్దు పైన ప్రధాని నరేంద్ర మోడీకి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలు ఆ లేఖలో పేర్కొన్నారు.
ఉత్తమ ప్రణాళికల ఉద్దేశ్యాలు మంచివే అయినా వాటిని సరిగ్గా అమలు చేయకపోతే విఫలమవుతాయని మోడీకి సూచించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తూనే, ఈ నిర్ణయం వల్ల రైతులు, గ్రామీణ కార్మికులు, చిన్న వ్యాపారులు, అసంఘటిత రంగ కార్మికులు, రోజువారి కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకు వెళ్లారు.

అనకాపల్లి బెల్లం హోల్సేల్ మూసివేయాల్సి వచ్చింది
నోట్ల రద్దుతో రోజు రోజుకు నిరుపేదలు, చిన్న వ్యాపారులు, అసంఘటిత రంగం, రిటైల్ రంగాలు తీవ్ర దుస్థితిని ఎదుర్కొంటున్నాయని చెప్పారు. మార్కెట్ యార్డులు, మండీలలో కార్యకలాపాలు గణనీయంగా తగ్గిపోయాయని, వందేళ్ల చరిత్ర కలిగిన అనకాపల్లి బెల్లం హోల్సేల్ మార్కెట్ మూసివేయాల్సి వచ్చిందన్నారు.
రైతుల పరిస్థితి..
రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. రైతుల్లో 40 శాతం మందికి మాత్రమే బ్యాంకు ఖాతాలు ఉన్నాయని తెలిపారు. అరవై శాతం మంది రైతులు వడ్డీకి డబ్బులు తెచ్చుకుంటున్నారన్నారు. ఇప్పుడు రైతులకు డబ్బులు దొరకడం లేదన్నారు.
95 శాతం మంది రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదన్నారు. ఎరువులు, విత్తనాలు అమ్మేవారు పాత నోట్లను తీసుకోవట్లేదని చెప్పారు. నోట్ల రద్దుతో పండిన పంటను సైతం రైతులు అమ్ముకోలేకపోతున్నారని చెప్పారు. మద్దతు ధరలో సగం ధరకే మధ్యవర్తులకు అమ్ముకోవాల్సి వస్తోందన్నారు.
పెళ్లిళ్లకు ఇబ్బంది
6.38 లక్షల గ్రామాల్లో నగదు ఆధారంగానే లావాదేవీలు జరుగుతున్నాయన్నారు. ఒకే ఒక్క నిర్ణయంతో రాత్రికి రాత్రే మార్పు రాదన్నారు. నోట్ల రద్దుతో చాలామంది పెళ్లిళ్లు చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారని జగన్ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
నా మద్దతు ఉంటుంది
రాజకీయాల నుంచి నల్లధనాన్ని ఏరివేయడానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని జగన్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలు పెంపొందించేందుకు మద్దతిస్తామన్నారు. ప్రస్థుత పరిస్థితులను అధిగమించేందుకు ప్రయత్నించాలన్నారు. అన్ని రాజకీయ పార్టీల సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కమిటీలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గురించి తెలిసిన అనుభవజ్ఞులు ఉండాలన్నారు. పాత నోట్ల చెల్లుబాటు తేదీపై పునరాలోచన చేయాలని పేర్కొన్నారు.
లోపాలు సరిదిద్దండి
అంతకుముందు మాట్లాడుతూ.. నోట్ల రద్దు లోపాలు సరిదిద్దాలని విజ్ఞప్తి చేశారు. అప్పటి దాకా నిర్ణయాన్ని వాయిదా వేయాలన్నారు. అమలు సక్రమంగా లేకపోతే ఎలాంటి నిర్ణయాలైనా విఫలమే అన్నారు. పూర్తిగా సన్నద్ధమైన తర్వాతే రద్దు నిర్ణయాన్ని అమలు చేయాలన్నారు. ఫలానా తేదీ నుంచి అమలు చేస్తామని చెబితే ఎలాంటి నష్టం జరగదన్నారు. అలాగే, చలామణిలో ఉన్న నగదు ఎక్కడికీ వెళ్లదన్నారు.
కూలీలకు కార్డులిచ్చి స్వేపింగా
కూలీలకు కార్డులు ఇచ్చి స్వైపింగ్ చేయమంటారా అని నిలదీశారు. రద్దు పైన చంద్రబాబుకు ముందే తెలుసునని, అందుకే ఆయన అంతా సర్దేసుకున్నారని చెప్పారు. హెరిటేజ్ షేర్లు ఫ్యూచర్ గ్రూపుకు అమ్మేశారని తెలిపారు.
నిన్న ప్రధాని మోడీని పొగిడారని, ఇప్పుడు విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. జనం తిడుతున్నారనే చంద్రబాబు ప్లేటు మార్చారన్నారు. ఏ విషయంలోనైనా క్రెడిట్ కొట్టేయటం చంద్రబాబుకు అలవాటు అన్నారు. అందుకే నోట్ల రద్దు గురించి తాను లేఖ రాశానని చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
ఎవరికీ తెలియకుండా రద్దు నిజమేనా
కేంద్రం ఎవరికీ తెలియకుండా రద్దు చేశామని చెబుతోంది అది నిజమేనా అని జగన్ ప్రశ్నించారు. మంచి ఉద్దేశ్యాలతో బయటకు వచ్చినా ప్రణాళికలు కూడా అమలు సరిగ్గా లేకపోతే విఫలమవుతాయని మనకు చరిత్ర చెబుతోందన్నారు. గ్రామాల్లో నగదు ద్వారానే లావాదేవీలు జరుగుతుంటాయన్నారు. రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు.
హఠాత్తుగా చేస్తే ఎలా
ఇంత హఠాత్తుగా రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేస్తే జనం ఏమయిపోవాలని జగన్ ప్రశ్నించారు. మన దేశంలోని అన్ని ప్రింటింగ్ ప్రెస్లు, మింట్స్ మూడు షిప్టులు విరామం లేకుండా పని చేస్తే రూ.15 లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణిలో ఉన్నాయన్నారు. కొత్త నోట్లు ముద్రించేందుకు ఆరు నెలలు పడుతుందని చెబుతున్నారని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications