పరిటాల కుటుంబంపై జగన్-ప్రకాశ్ సంచలన వ్యాఖ్యలు, బాధపడ్డ సునీత, రెచ్చగొట్టొద్దంటూ
అనంతపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం అనంతపురం జిల్లాలోని రాప్తాడులో ప్రజా సంకల్ప యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ ఇంచార్జ్ ప్రకాశ్ రెడ్డి మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీతపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ సమక్షంలోనే సంచలన వ్యాఖ్యలు చేశారు.
Recommended Video
నువ్వు చెప్తేనే: పవన్ కళ్యాణ్ దుమ్ముదులిపిన రోజా, ఆ మాటలకు దిమ్మతిరిగే కౌంటర్
ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ... పరిటాల కుటుంబం రాప్తాడు నియోజకవర్గాన్ని హత్యా రాజకీయాలతో నడుపుతుందే తప్ప, ప్రజలకు మేలు చేయలేదని మండిపడ్డారు. స్థానిక సంస్థల్లో కుటుంబ పాలన తీసుకు వచ్చి ఎన్నికల్లో గెలుపొందిన వారిని దూరం ఉంచారన్నారు. నా సొంత డబ్బుతో నియోజకవర్గం ప్రజలకు చేతనైన సాయం చేస్తున్నానని చెప్పారు.
పాతికేళ్లుగా పరిటాల కుటుంబానికే అవకాశం, ఉద్వేగ
పరిటాల కుటుంబానికి పాతికేళ్లుగా అధికారం కట్టబెడుతున్నారని, వారు నియోజకవర్గానికి ఏం చేశారో ఒక్కసారి ఆలోచించాలని ప్రకాశ్ రెడ్డి అన్నారు. నాకు ఒక్క అవకాశమివ్వాలని, ప్రాణం పోయే వరకు నియోజకవర్గ ప్రజలను గుండెంల్లో పెట్టుకుంటానని ఉద్వేగంగా ప్రసంగించారు.
మేం అధికారంలోకి వస్తే
వైసీపీ అదినేత జగన్ కూడా మాట్లాడారు. నిరుద్యోగ భృతి ఇస్తానని హామీలు గుప్పించిన సీఎం చంద్రబాబు ఆ ఊసే లేకుండా యువతకు అన్యాయం చేశారని మండిపడ్డారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే ప్రత్యేక హోదా సాధనలో చంద్రబాబు విఫలం అయ్యారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల అనుభవం, విద్యార్హతల మేరకు ఉద్యోగాలు క్రమబద్ధీకరిస్తామన్నారు.
చంద్రబాబు భారీ అవినీతి
ఒక్క విద్యుత్తు విషయంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడుతున్నారని జగన్ ఆరోపించారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో రాయితీతో తక్కువ ధరలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తే చంద్రబాబు ధరలు పెంచి అమ్మేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. విద్యుత్తు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి, అధిక ధరలతో భారం మోపుతున్నారన్నారు. అన్నదాతలు, పొదుపు మహిళలకు రుణ మాఫీ కొలిక్కి తేలేదన్నారు.
జగన్, వైసీపీ నేతల వ్యాఖ్యలు సరికాదు
జగన్ ప్రజా సంకల్ప యాత్రలో పరిటాల కుటుంబంపై వైసీపీ నేత ప్రకాశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు భగ్గుమన్నారు. దౌర్జన్యాలు, అరాచకాలు, హత్యా రాజకీయాలకు పాల్పడే సంస్కృతి వైసీపీదేనని టీడీపీ నేతలు వేణుగోపాల్, జయకృష్ణ తదితరులు విమర్శించారు. జగన్, వైసీపీ నేత ప్రకాశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. అంతకుముందు జగన్ కూడా పరిటాల కుటుంబం ఫ్యాక్షన్ రాజకీయాలు పెంచి పోషిస్తోందన్నారు.
రాజకీయంగా ఎదుర్కోలేక పరిటాల కుటుంబంపై
రాజకీయంగా ఎదుర్కోలేకనే పరిటాల కుటుంబంపై లేనిపోని వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ నాయకులు ధ్వజమెత్తారు. రాజకీయ కుతంత్రాలతో ప్రకాష్ రెడ్డి రాప్తాడులో గెలవాలని చూస్తున్నారని, పరిటాల కుటుంబంపై గెలవలేరన్నారు. కాగా, వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. చిన్నంపల్లి నుంచి ర్యాలీ ప్రారంభించారు. కానీ వారిని పోలీసులు అడ్డుకున్నారు. అందరినీ ఒకేసారి పంపించకుండా పరిమితంగా వదిలేశారు.
జగన్ వ్యాఖ్యలకు బాధపడ్డ పరిటాల సునీత
కాగా, తాను ఫ్యాక్షన్ను పెంచి పోషిస్తున్నట్టు జగన్ చేసిన వ్యాఖ్యలపై పరిటాల సునీత తీవ్రంగా మండిపడ్డారు. జగన్ వ్యాఖ్యలు తనకు బాధను కలిగించాయన్నారు. తమను రెచ్చగొట్టేలా మాట్లాడవద్దని హెచ్చరించిన ఆమె, ఫ్యాక్షన్ లీడర్లను రాయలసీమ ప్రజలు తరిమికొడుతారన్నారు. ఏదైనా మాట్లాడేముందు, విమర్శించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని హితవు పలికారు.