ఏపీలో వర్షాలు.. సీఎం జగన్ ఆరా.. అధికారులు అలర్ట్..!
అమరావతి : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. వరద తీవ్రత మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఆ క్రమంలో గోదావరి తీర లంక గ్రామాలను అధికారులు అలర్ట్ చేశారు. శనివారం మధ్యాహ్నంకల్లా ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 8 లక్షల 60 వేల క్యూసెక్కులుగా నమోదైంది. ప్రతి గంటకూ వరద ఉధృతి పెరుగుతుండటంతో గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది.
ధవళేశ్వరం దిగువన గోదావరి ఉప నదులైన వశిష్ట, వైనతేయ, గౌతమి పరవళ్లు తొక్కుతున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి వరద పోటెత్తడంతో మొదటి ప్రమాదపు హెచ్చరికలు జారీ చేశారు. అదలావుంటే గోదావరి నదికి వరద నీరు చేరుతున్న క్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. మరోవైపు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు, పోలీసులు అలర్టయ్యారు.
గోదావరి ఉగ్రరూపం.. కొన్ని పల్లెల్లో అంధకారం
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది. వరద ప్రవాహం పెరగడంతో పోలవరం ప్రాజెక్ట్ దగ్గర భారీగా వరదనీరు చేరడంతో పనులను నిలిపివేశారు. స్పిల్వే పనులకు ఆటంకం లేకుండా వేసిన అడ్డుకట్ట కూడా బీటలువారుతోంది. మరోవైపు ధవళేశ్వరం నుంచి భారీగా నీరు రావడంతో లంక గ్రామాల కాజ్వే లు మునిగిపోయాయి. వేలేరుపాడు మండలంలోని కొయిదాతో పాటు పరిసరాల గ్రామాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయి అంధకారం ఏర్పడింది.
ఆచంట మండలంలో ఏడు లంక గ్రామాలకు పడవ ప్రయాణం నిలిచిపోయింది. గోదావరి ముంపు గ్రామాల్లో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ముత్యాల రాజు లాంచీలో పర్యటిస్తూ పరిస్థితిని సమీక్షించారు. కొయిదా, కటుకూరు, రేపాకగొమ్ము, పేరంటాళ్ల పల్లి గ్రామాల ప్రజలకు నిత్యావసర వస్తువులను అధికారులు లాంచీల్లో తరలిస్తున్నారు.
హయత్నగర్ బీఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్ కథ.. మరెన్నో నిజాలు.. నిందితుడు మామూలోడు కాదుగా..!
సీఎం జగన్ ఆరా.. అధికారులు అలర్ట్గా ఉండాలని ఆదేశం
ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న సీఎం జగన్.. గోదావరి వరద ఉధృతిపై ఆరా తీశారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని పరిస్థితులపై సమాచారం అడిగారు. ఆ మేరకు సీఎం క్యాంపు కార్యాలయం అధికారులు వివరాలు వెల్లడించారు. అంతేకాదు ఎప్పటికప్పుడు రిపోర్టులు పంపిస్తున్నారు. ముంపు గ్రామాల్లో చేపడుతున్న సహాయక చర్యల గురించి కూడా జగన్ అడిగి తెలుసుకున్నారు. సురక్షిత ప్రాంతాలకు బాధితులను తరలించి భోజన సదుపాయాలతో పాటు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా ఎదుర్కొనేలా సిద్ధంగా ఉండాలని సూచించారు.
పోలీస్ శాఖ అలర్ట్.. ఎప్పటికప్పుడు సమీక్ష
గోదావరి నదికి వరద నీరు పెరుగుతున్న నేపథ్యంలో పోలీస్ శాఖ కూడా అలర్ట్గా ఉందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఫైర్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, లోకల్ పోలీసులు సిద్దంగా ఉన్నారని వెల్లడించారు. శాటిలైట్ ఫోన్స్తో పాటు డ్రోన్ కెమెరాలను వినియోగిస్తూ పరిస్ధితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని చెప్పారు. అంతేకాదు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ముంపు గ్రామాల్లో సహాయక చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు. అదలావుంటే ఇప్పటికే ముంపు గ్రామాల బాధితులకు 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళా దుంపలు, 2 లీటర్ల కిరోసిన్, లీటర్ పామాయిల్, కేజీ ఉల్లిపాయలు పంపిణీ చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.
రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తం
భారీగా కురుస్తున్న వర్షాలకు దేవిపట్నం మండలంలోని దాదాపు 26 గ్రామాలు నీట మునిగాయి. ధవళేశ్వరం బ్యారేజి దగ్గర నీటి మట్టం 10.6 అడుగులకు చేరడంతో 175 గేట్లు పూర్తిగా ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. అదలావుంటే గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న క్రమంలో తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కోరారు. ధవళేశ్వరం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశామని, రెండవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే ఛాన్సునట్లు తెలిపారు. మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని.. సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని ఆదేశించారు. ఉత్తర కోస్తా తీరం వెంబడి గంటకు 55 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందన్నారు.