ములాయంతో జగన్: బాబుకు షాక్ ఇచ్చేలా!, ప్రజాస్వామ్యం కుప్పకూలే ప్రమాదముందని..
ములాయం-జగన్ మధ్య దాదాపు అరగంట భేటీ జరగ్గా.. ఫిరాయింపు చట్టాల గురించి ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.
న్యూఢిల్లీ: ప్రతిపక్ష పార్టీ గుర్తుపై గెలిచి ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకోవడం పట్ల వైసీపీ తీవ్ర అసంతృప్తితో ఉంది. చంద్రబాబు సర్కార్ లో ప్రజాస్వామ్యానికి విలువ లేదని ఆరోపిస్తూ.. టీడీపీ తీరును ఢిల్లీ సాక్షిగా ఎండగట్టేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు.
ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న వైసీపీ అధినేత జగన్ తాజాగా సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ ను కలిశారు. ఈ సందర్బంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలను మంత్రివర్గంలో చేర్చుకున్న తీరుపై జగన్ ములాయంకు విన్నవించారు. స్పీకర్ వద్ద అనర్హత పిటిషన్లు పెండింగ్లో ఉండగానే నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలను మంత్రిర్గంలోకి ఎలా తీసుకుంటారని ఆయనతో ఆవేదన చెందారు.
ములాయం-జగన్ మధ్య దాదాపు అరగంట భేటీ జరగ్గా.. ఫిరాయింపు చట్టాల గురించి ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశంలో ప్రజాస్వామ్యం కుప్పకూలిపోతుందని, కాబట్టి ఫిరాయింపు నిరోధక చట్టాన్ని మరింత కఠినతరం చేయాలని జగన్ ములాయంతో వ్యాఖ్యానించినట్లు సమాచారం. సీఎం, స్పీకర్, గవర్నర్.. ఈ ముగ్గరు ఫిరాయింపు నిరోధక చట్టాన్ని యథేచ్చగా ఉల్లంఘించారని ఈ సందర్బంగా జగన్ వాపోయారు.
కాగా, ములాయంను కలవడానికి జగన్ వెంట వెళ్లినవారిలో ఆ పార్టీ ఎంపీలు అవినాష్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి సహా తదితర నేతలు ఉన్నారు.